Russian Missile Strike: మిత్రదేశమైన భారత ఫార్మా సంస్థ గిడ్డంగిపై రష్యా క్షిపణి దాడి..ఎందుకిలా..
ABN , Publish Date - Apr 13 , 2025 | 07:38 AM
ఉక్రెయిన్ రాజధాని కీవ్ మరోసారి రష్యన్ దాడులకు లక్ష్యంగా మారింది. కానీ ఈసారి టార్గెట్ అయింది కేవలం ఓ భవనం కాదు, వేల మంది జీవితాలకు అవసరమైన ఔషధాలు నిల్వ ఉన్న భారత కుసుమ్ ఫార్మాస్యూటికల్ గిడ్డంగి. ఈ దాడి ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.

ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో చోటుచేసుకున్న తాజా ఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది. శనివారం ఉదయం, ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని ప్రముఖ భారతీయ ఔషధ సంస్థ కుసుమ్ ఫార్మాస్యూటికల్స్ గిడ్డంగిపై రష్యా క్షిపణి దాడి జరిపింది. ఈ దాడిలో పిల్లలు, వృద్ధులకు అత్యవసరంగా అవసరమయ్యే ఔషధాలు పూర్తిగా నాశనం అయ్యాయి. ఈ విషాద ఘటనపై ఉక్రెయిన్ రాయబార కార్యాలయం తీవ్రంగా స్పందించింది. "భారత్తో ప్రత్యేక స్నేహం" అని చెబుతున్న రష్యా, ఉద్దేశపూర్వకంగా భారతీయ సంస్థలపై దాడులు చేయడం విడ్డూరంగా, బాధాకరంగా ఉందని తెలిపింది.
వ్యాపారాలపై కూడా
భారత వ్యాపార ప్రయోజనాలను దెబ్బ తీస్తున్న ఈ చర్యల పట్ల అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక వైపు స్నేహం అని చెప్పుకుంటూ, మరోవైపు వ్యాపార నష్టం కలిగించడమేంటని ప్రశ్నించారు. ఈ ఘటన, యుద్ధం క్రూరతను మాత్రమే కాక, వ్యాపారాలపై కూడా ప్రభావాన్ని బలంగా చూపిస్తోందని ప్రస్తావించారు. అయితే ఈ ఘటనపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.
కుసుమ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ భారతీయ వ్యాపారవేత్త రాజీవ్ గుప్తా యాజమాన్యంలో ఉంది. ఈ కంపెనీ ఉక్రెయిన్లోని అతిపెద్ద ఔషధ సంస్థలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ గిడ్డంగిలో పిల్లలు, వృద్ధులకు అవసరమైన ఔషధాలు నిల్వ చేయబడతాయి. రష్యా క్షిపణి దాడి వల్ల ఈ ఔషధాల నిల్వలు ధ్వంసమయ్యాయి, దీంతో అక్కడి ప్రజలకు ఔషధాల విషయంలో మరిన్ని ఇబ్బందులు రానున్నాయి.
తీవ్రంగా ఖండించిన..
ఉక్రెయిన్ రాయబార కార్యాలయం ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. రష్యా ఉక్రెయిన్లోని భారతీయ వ్యాపారాలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని, మానవతా ప్రయోజనాలకు అవసరమైన ఔషధాలను ధ్వంసం చేయడం దారుణమని పేర్కొంది. ఈ చర్యను అంతర్జాతీయ మానవతా నిబంధనల ఉల్లంఘనగా అభివర్ణించింది. ఈ దాడి ఉక్రెయిన్లోని బ్రిటిష్ రాయబారి మార్టిన్ హారిస్ ద్వారా కూడా ధృవీకరించబడింది. రష్యా డ్రోన్లు కీవ్లోని ప్రధాన ఔషధ గిడ్డంగిని ధ్వంసం చేశాయని, ఆయన సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పంచుకున్నారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇలాంటి దాడులు మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రపంచ సమాజం ఇలాంటి చర్యలను ఖండించి, శాంతి, మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని అక్కడి స్థానికులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Gold Silver Rates Today: రూ.5 వేలు పెరిగిన బంగారం..గోల్డ్ను బీట్ చేసిన వెండి
Meta: మెటా మార్క్ జుకర్బర్గ్ చైనాతో ఒప్పందం..అమెరికాను మోసం చేశాడా..
SVPNPA Job Openings: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో డ్రీమ్ జాబ్స్..మీకు అర్హత ఉందా, అప్లై చేశారా
Read More Business News and Latest Telugu News