Reservation Shock Karnataka: కర్ణాటకలో కులగణన రచ్చ
ABN , Publish Date - Apr 15 , 2025 | 03:24 AM
కర్ణాటక కులగణన నివేదిక బయటకు రావడంతో ముస్లింలు బీసీల రిజర్వేషన్ల పెంపుపై దుమారం రేగింది ఆధిపత్య కులాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి

ముస్లింలకు 8% రిజర్వేషన్లు?..ఓబీసీలకు 52 శాతానికి పెంపు
బెంగళూరు, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): కులగణన నివేదికలోని వివరాలు బయటికి రావడంతో కర్ణాటకలోని ఆధిపత్య కులాలు రగిలిపోతున్నాయి. నివేదికలోని సిఫారసుల మేరకు ప్రస్తుతం 4 శాతంగా ఉన్న ముస్లిం రిజర్వేషన్లు 8 శాతానికి పెరిగే అవకాశం ఉంది. అలాగే, బీసీలకు ప్రస్తుతం ఉన్న 32శాతం రిజర్వేషన్లు 52 శాతానికి పెరగనున్నట్టు తెలుస్తోంది. ఎస్సీలకు 17శాతం, ఎస్టీలకు 7శాతంతో కలిపి మొత్తం రిజర్వేషన్లను 76 శాతానికి చేర్చాలని నివేదికలో సిఫారసులు ఉన్నాయి. మిగిలిన సామాజికవర్గాలకు రిజర్వేషన్లలో మార్పులు ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2015లో అప్పట్లో సీఎంగా ఉన్న సిద్దరామయ్య కులగణన సర్వే చేయించారు. ఆయన అధికారంలో ఉన్న 2018 నాటికే సర్వే పూర్తయింది. బీసీ కమిషన్ చైర్మన్ జయప్రకాశ్హెగ్డే నేతృత్వంలో 2024 ఫిబ్రవరిలో ప్రభుత్వానికి ఆ నివేదికను అప్పగించారు. ఆ నివేదికలో రిజర్వేషన్ల శాతం పెంపు అంశాన్ని పొందుపరిచినట్లు సమాచారం. కులగణన నివేదికను మంత్రివర్గం శుక్రవారం స్వీకరించింది. అదే రోజున సీల్డ్ కవర్ను తెరిచారు. నివేదిక కాపీలను మంత్రులందరికీ అందజేశారు. ఈ నెల 17లోగా మంత్రులు సమగ్ర అధ్యయనం చేసి, నివేదికపై తీర్మానం చేయాల్సి ఉంది. గురువారం నిర్వహించే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. నివేదిక ప్రకారం కర్ణాటకలో వెనుకబడిన కులాల జనాభా 69.60 శాతానికి చేరింది. అయితే, రాష్ట్రంలో బలమైన సామాజికవర్గం వీరశైవలింగాయతలు కులగణన నివేదికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ నివేదికను చెత్తబుట్టలో పడేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..