Telangana SC Reservation: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల.. ఇకపై ఉద్యోగాల్లో
ABN , Publish Date - Apr 14 , 2025 | 03:02 PM
Telangana SC Reservation: తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జీవోను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలులోకి వస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్, ఏప్రిల్ 14: తెలంగాణలో (Telanagna) ఎస్సీ వర్గీకరణ జీవో (SC classification GO) విడుదలైంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సర్కార్ ఈ జీవోను విడుదల చేసింది. ఈనెల 8న దీనికి సంబంధించిన బిల్లును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు (Governor Jishnu Dev Verma) సర్కార్ పంపించగా.. అందుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో ఇప్పటి వరకు ఒకే విధంగా అమలైన రిజర్వేషన్లు ఇకపై వర్గీకరణ ప్రకారం అందించనున్నారు. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో కూడా అధికారులు గెజిట్ విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం 59 ఉప కులాలను మూడు గ్రూపులకు విభజించారు. గ్రూప్ ఏలో 15 ఉపకులాలకు ఒక శాతం రిజర్వేషన్లు కేటాయించారు. గ్రూప్ బీలో 18 ఉప కులాలకు 9 శాతం, గ్రూప్ సీలో 26 ఉప కులాలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఎస్సీ వర్గీకరణ అమలు అయిన నేపథ్యంలో ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను ఈ గ్రూపుల ప్రాధాన్యత ఆధారంగా భర్తీ చేయనున్నారు.
ఉద్యోగ భర్తీపై త్వరలోనే నిర్ణయం: ఉత్తమ్
ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు నుంచి ఎస్సీ వర్గీకరణ అమలులోకి వస్తుందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ జీవోను సీఎంకు అందజేశామన్నారు. ఎస్సీ వర్గీకరణను ఏ పార్టీ ముందుకు తీసుకువెళ్లలేదన్నారు. అసెంబ్లీలో చర్చకే పరిమితం అయ్యాయని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన రెండు గంటల్లోనే తాము కీలక అడుగు ముందుకేశామన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసే వరకు ఉద్యోగ నోటిఫికేషన్ వేయమని చెప్పామన్నారు. చెప్పినట్లే ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదని తెలిపారు.
రేపు కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై ఉద్యోగ భర్తీపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. షమీమ్ అక్తర్ ఇచ్చిన నివేదిక మేరకే రిజర్వేషన్ కల్పిస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలిపారన్నారు. సుప్రీంకోర్ట్ తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ అని చెప్పుకొచ్చారు. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం జీవో నంబర్ 9ని విడుదల చేశామన్నారు. ఈ క్షణం నుంచే వర్గీకరణ అమలు అవుతుందన్నారు. రూల్స్ కోసం జీవో నంబర్ 10ని విడుదల చేశామన్నారు. రాబోయే జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్ పెంచుతామన్నారు. ఈరోజు నుంచి పెద్ద సంఖ్యలో ఖాళీలు భర్తీ చేయబోతున్నామని.. వాటన్నింటికి వర్గీకరణ వర్తిస్తుందని వెల్లడించారు. జీవో నంబర్ 29 ప్రకారం రోస్టర్ పాయింట్స్ కేటాయింపు ఉంటుందని.. ఈ చారిత్రాత్మక ఘట్టంలో పాల్గొనడం చాలా సంతోషమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
Falaknuma Crime News: వివాహమైన మూడు రోజులకే రౌడీషీటర్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే
CM Revanth Praised Women: సన్నబియ్యంతో సహపంక్తి భోజనం.. మహిళకు సీఎం అభినందనలు
Read Latest Telangana News And Telugu News