నేడు, రేపు వడగాలులు.. 21-24 తేదీల్లో పలు జిల్లాల్లో వర్షాలు
ABN , Publish Date - Mar 17 , 2025 | 05:00 AM
రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. చాలాప్రాంతాల్లో 40డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 4 రోజు లు పాటు ఎండల తీవ్రత ఇదే రకంగా కొనసాగనుంది.

వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు
ఆసిఫాబాద్లో 42.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్)
రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. చాలాప్రాంతాల్లో 40డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 4 రోజు లు పాటు ఎండల తీవ్రత ఇదే రకంగా కొనసాగనుంది. ముఖ్యంగా సోమ, మంగళవారాల్లో కొమరం భీం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే, 21 నుంచి 24 వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఇక, హైదరాబాద్లో వచ్చే మూడు రోజుల్లో 38-40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది.
కాగా, ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ మండలంలో ఆదివారం రాష్ట్రంలోనే అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లా కెరమరిలో 42.3, బెజ్జూరులో 42.1, రెబ్బెనలో 41.9, కౌటాలలో 41.8, తిర్యాణి, పెంచికలపేటలో 41.6, సిర్పూర్(టి), వాంకిడి మండలాల్లో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిరిసిల్ల, జగిత్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోనూ 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
అన్నిరంగాల్లో అభివృద్ధే ధ్యేయం
CM Revanth Reddy: తాగుబోతోడు జాతిపితా?