ఒకే పనికి ఎమ్మెల్యే, కార్పొరేటర్ శంకుస్థాపన..
ABN , Publish Date - Mar 18 , 2025 | 10:34 AM
ఒకే పనికి అటు ఎమ్మెల్యే, ఇటు కార్పొరేటర్ శంకుస్థాపన చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి శంకుస్థాపన చేసిన పనులను సోమవారం మరోసారి మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి శంకుస్థాపన చేయడానికి వస్తున్నారని తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

- శంకుస్థాపన శిలాఫలకం వద్ద నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు
- అరెస్టుచేసి పోలీస్స్టేషన్కు తరలించిన పోలీసులు
హైదరాబాద్: ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి(MLA Devireddyy Sudheer Reddy) శంకుస్థాపన చేసిన పనులను సోమవారం మరోసారి మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి శంకుస్థాపన చేయడానికి వస్తున్నారని తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కార్పొరేటర్ రాక ముందే సోమవారం ఉదయం మన్సూరాబాద్ డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు రఘువీర్రెడ్డి(Raghuveer Reddy) ఆధ్వర్యంలో పలువురు పార్టీ నాయకులు వీరన్నగుట్ట పోచమ్మ ఆలయం వద్దకు చేరుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఈ వార్తను కూడా చదవండి: Temperatures: మెట్టుగూడ మండిపోయింది..
ముందస్తు సమాచారం ఉన్న హయత్నగర్ సీఐ నాగరాజుగౌడ్తో పాటు పలువురు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బీఆర్ఎస్ నాయకులను పోలీసులు కోరారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు రోడ్డు మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ఈనెల 12వ తేదీన శంకుస్థాపన చేసిన పనులకు కార్పొరేటర్ మరోసారి ఎలా శంకుస్థాపన చేస్తారని రఘువీర్రెడ్డి సీఐతో వాగ్వాదానికి దిగారు. అదంతా నాకు తెలియదు లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది కనుక ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు.
దీంతో వారు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మా ఎమ్మెల్యే గారు ఇక్కడికి వస్తున్నారు.. మీరు మాట్లాడం డి అంటూ రఘువీర్రెడ్డి సీఐకి పోన్ ఇచ్చారు. దీంతో సీఐ మాట్లాడుతూ ఏదైన ఉంటే ఎమ్మెల్యే నాకు ఫోన్ చేస్తారు కదా అంటూ ఫోన్ తీసుకోకుండా దాట వేశారు. పోలీసులు బలవంతంగా నిరసన వ్యక్తం చేస్తున్న 12మందిని అరెస్టు చేసి అబ్దుల్లాపూర్మెట్కు తరలించారు. రఘువీర్రెడ్డితో పాటు, జగదీష్యాదవ్, టంగుటూరు నాగరాజు, నర్సింహ యాదవ్, చంద్రారెడ్డి, అనీల్కుమార్తో పాటు పలువురు ఉన్నారు.
ఎమ్మెల్యే - కార్పొరేటర్ మధ్య శంకుస్థాపన పంచాయితీ
ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, కార్పొరేటర్ నర్సింహారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. నర్సింహారెడ్డి కార్పొరేటర్గా ఎన్నికైనప్పటి నుంచి ఇద్దరి మధ్య ఇదే పరిస్థితి నెలకొంది. ఈనెల 12న ఎమ్మెల్యే వీరన్నగుట్ట వద్ద గల పోచమ్మ ఆలయం వద్ద రూ.10లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, రూ.10లక్షలతో చేపట్టిన ఓపెన్ జిమ్కు శంకుస్థాపన చేశారు. తనకు సమాచారం ఇవ్వలేదని కార్పొరేటర్ గైర్హాజరు అయ్యారు.
ఎమ్మెల్యే మాత్రం అధికారులతోనే కార్పొరేటర్కు సమాచారం ఇప్పించామని అంటున్నారు. నాకు ఎవరు చెప్పలేదని కార్పొరేటర్ నా కొబ్బరికాయను నేను కొట్టుకుని మరోసారి శంకుస్థాపన చేస్తానని సోమవారం వీరన్నగుట్టకు వచ్చి మరో సారి రెండు పనులకు శంకుస్థాపన చేశారు. కార్పొరేటర్ను అడ్డుకోవడానికి వచ్చిన బీఆర్ఎస్ నాయకులను హయత్నగర్ పోలీసులు అరెస్టు చేసి అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. గతంలో పవనగిరి కాలనీలో ఒకే పనికి ఎమ్మెల్యే, కార్పొరేటర్ వేరు వేరుగా శంకుస్థాపనలు చేశారు.
బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం
బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టుచేసి అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్కు తరలించారని తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్రెడ్డి సోమవారం మధ్యాహ్నం అక్కడికి చేరుకుని కార్యకర్తలను పరామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమాచారం ఇచ్చిన మన్సూరాబాద్ కార్పొరేటర్ శంకుస్థాపన పనులకు రాలేదు. తాను శంకుస్థాపన చేసిన పనులు మరో సారి కార్పొరేటర్ శంకుస్థాపన చేయడాన్ని నిరసన తెలపడానికి వెళ్లిన బీఆర్ఎస్ కార్యకర్తల పైన హయత్నగర్ సీఐ నాగరాజుగౌడ్ కృరంగా వ్యవహరించారని అన్నారు. అసభ్య పదజాలంతో తిట్టి, బట్టలు చింపి, తొక్కి అరెస్టు చేసి లోపల వేశారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. దీని పర్యావసానాలు వేరుగా ఉంటాయన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
టన్నుల్లో స్మగ్లింగ్.. గ్రాముల్లో పట్టివేత
టికెట్ సొమ్ము వాపస్ కు 3 రోజులే గడువు
ఛీ.. మీరసలు మనుషులేనా.. ఇంత దారుణమా..
వారణాసిలో రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి వాసులు మృతి
Read Latest Telangana News and National News