Share News

అట్టడుగువర్గాల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేయాలి

ABN , Publish Date - Apr 08 , 2025 | 11:43 PM

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఎస్సీ కమిషన్‌ జాతీయ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్‌ అన్నారు. మంగళవారం ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియంలో హాలులో పెద్దపల్లి, మంచిర్యాల కలెక్టర్లు కోయ శ్రీహర్ష, కుమార్‌ దీపక్‌, అదనపు కలెక్టర్‌ జె.అ రుణశ్రీ, డీసీపీ భాస్కర్‌, ఎస్సీ కమిషన్‌ జాతీయ సలహాదారులు సునీల్‌ బాబు, రీసెర్చ్‌ అధికారి డి.వరప్రసాద్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు.

అట్టడుగువర్గాల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేయాలి

జ్యోతినగర్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి) : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఎస్సీ కమిషన్‌ జాతీయ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్‌ అన్నారు. మంగళవారం ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియంలో హాలులో పెద్దపల్లి, మంచిర్యాల కలెక్టర్లు కోయ శ్రీహర్ష, కుమార్‌ దీపక్‌, అదనపు కలెక్టర్‌ జె.అ రుణశ్రీ, డీసీపీ భాస్కర్‌, ఎస్సీ కమిషన్‌ జాతీయ సలహాదారులు సునీల్‌ బాబు, రీసెర్చ్‌ అధికారి డి.వరప్రసాద్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఎస్సీ వర్గాలకు అమలవుతున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల గురించి కలెక్టర్లు వివరించారు. గతంలో ఎస్సీ కమిషన్‌ సభ్యుడి ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల్లో జారీ చేసిన ఆదేశాలు, సూచనల అమలు, పనుల పురోగతిని అధికారులు వివరించారు. ఎస్సీ కమిషన్‌ జాతీయ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసులను పక్కాగా నమోదు చేయాలని, నిందితులకు కచ్చితంగా శిక్ష పడేలా సాక్ష్యాలను సేకరించాలన్నారు. అట్రాసిటీ కేసుల సత్వర పరిష్కారానికి పోలీసు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని, అందిన ఫిర్యాదులకు తక్షణం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించారు. బలహీన వర్గాల యువత పరిశ్రమలు స్థాపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలు, ప్రోత్సహకాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. బెల్లంపల్లిలో ఉన్న ఇండస్ట్రియల్‌ పార్కులో ఎస్సీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయించాలని సూచించారు. ప్రధాని ఉపాధి కల్పన, ముద్రా రుణాలు, అంబేద్కర్‌ విదేశీ విద్యా పథకం, కులాంతర వివాహం సబ్సిడీ సకాలంలో అందేలా చూడాలని సూచించారు. దళితుల భూములను ఆక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని, ఆక్రమణదారుపై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ నియామకాలలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తప్పకుండా పాటించాలన్నారు. రెండు జిల్లాల్లోని ఎస్సీ బ్యాక్‌లాగ్‌ పోస్టులు, కారుణ్య నియామకాలు, పదోన్నతుల పెండింగ్‌ లిస్టు అందజేయాలని ఆదేశించారు.

అట్రాసిటీ కేసుల్లో బాధితులకు పరిహారం అందించాం

- కోయ శ్రీ హర్ష , పెద్దపల్లి కలెక్టర్‌

అట్రాసిటీ కేసులకు సబంధించి బాధితులకు చట్ట ప్రకారం పరిహారం సకాలంలో అందించామని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. బాధితులకు ఉపాధి కల్పన కింద రేషన్‌ డీలర్‌షిప్‌ ఇచ్చామని, వారి పిల్లలను గురుకులాలు, కేజీబీవీలలో చేర్పించి నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. అంబేద్కర్‌ విదేశీ విద్య పథకం కింద ఐదు దరఖాస్తులు వచ్చాయని, ముగ్గురు అభ్యర్థులకు 47 లక్షల రూపాయలు చెల్లించామన్నారు. కులాంతర వి వాహం కింద 16 జంటలకు 40 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించామన్నారు. సమావేశం అనంతరం ఎస్సీ కమిషన్‌ జాతీయ సభ్యుడు రాంచందర్‌ను అధికారులు సన్మానించారు. సమావేశంలో రెండు జిల్లాల రెవెన్యూ అధికారులు గంగయ్య, సురేష్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 11:43 PM