KTR: భూముల వేలాన్ని విరమించుకోవాలి
ABN , Publish Date - Apr 07 , 2025 | 05:11 AM
రాష్ట్ర ప్రభుత్వం ఒక రియల్ఎస్టేట్ దళారి మాదిరిగా ఆర్థిక ప్రయోజనాల గురించి ఆలోచించకుండా, భవిష్యత్ ప్రయోజనాల కోసం కంచె గచ్చిబౌలి భూముల వేలాన్ని పూర్తిగా విరమించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.

కంచె గచ్చిబౌలిని శాశ్వతంగా కాపాడుకుందాం
విద్యార్థులు, పర్యావరణవేత్తలకు కేటీఆర్ లేఖ
హైదరాబాద్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఒక రియల్ఎస్టేట్ దళారి మాదిరిగా ఆర్థిక ప్రయోజనాల గురించి ఆలోచించకుండా, భవిష్యత్ ప్రయోజనాల కోసం కంచె గచ్చిబౌలి భూముల వేలాన్ని పూర్తిగా విరమించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూ నివర్సిటీ విద్యార్థులు 400 ఎకరాల భూమిని కాపాడేందుకు నిస్వార్థంగా చేపట్టిన ఆందోళన అద్భుతమని పేర్కొన్నారు. ఈ భూములను శాశ్వతంగా కాపాడుకునేందుకు ఐక్యపోరాటం చేద్దామని విద్యార్థులు, పర్యావరణవేత్తలను ఆదివారం బహిరంగ లేఖ ద్వారా ఆయన కోరారు.
50 ఏళ్లకుపైగా సెంట్రల్ యూనివర్సిటీ పర్యావరణ పరిరక్షణకు, విజ్ఞానానికి కేంద్రంగా నిలిచిందని, కాంగ్రెస్ చెబుతున్న ఏకోపార్క్ కన్నాగొప్పగా పర్యావరణ సమతుల్యత కలిగిందిగా ఈ క్యాంపస్ నిలిచిందని తెలిపారు. ప్రకృతికి విఘాతంకలగకుండా, యూనివర్సిటీకి ప్రమాదం రాకుండా తమ పార్టీ విద్యార్థులకు అండగా ఉంటుందన్నారు. భూములను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం సాగిద్దామని, దీనికి విద్యార్థులు, పర్యావరణవేత్తలు, ప్రముఖులు, తెలంగాణ ప్రజలు కలిసి రావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.