Share News

కృష్ణా, గోదావరి జలాల ద్వారా సాగునీరు

ABN , Publish Date - Apr 14 , 2025 | 01:06 AM

చౌటుప్ప ల్‌ ప్రాంతంలో నెలకొన్న సాగు నీటి సమస్యను పరిష్కరించేందుకు కృష్ణా, గోదావరి జలాలను రప్పించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

 కృష్ణా, గోదావరి జలాల ద్వారా సాగునీరు

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి

చౌటుప్పల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): చౌటుప్ప ల్‌ ప్రాంతంలో నెలకొన్న సాగు నీటి సమస్యను పరిష్కరించేందుకు కృష్ణా, గోదావరి జలాలను రప్పించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం చౌటుప్పల్‌ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మార్కెట్‌ కమిటీ నూతన పాలక మండలితో కార్యదర్శి రవీందర్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో సాగు, తాగు నీటి సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరిస్తానన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్ట్‌లను నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రత్యేకశ్రద్ధ తీసుకొని పూర్తి చేయిస్తున్నారన్నారు. ఏఎంసీ నూతన పాలక వర్గం రైతులకు మెరుగైన సేవలను అందించాలని, పదవులను అలంకారంగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని, మార్కెట్‌ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తే కిరీటంగా కాకుండా బాధ్యతగా భావిస్తానని, 119 అసెంబ్లీ స్థానాల్లో మునుగోడును నంబరువన్‌గా చేస్తానన్నారు. తనకు ప్రచారం చేసుకోవడం ఇష్టం ఉండదని, పనులు చేసి ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకుంటానన్నారు.

ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టాలి : ఎంపీ

భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ, చౌటుప్పల్‌ పట్టణంలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ప్రజాపాలన సాగిస్తున్న రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై ప్రతి పక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎప్పటి కప్పుడు తిప్పికొట్టాలని, క్షేత్రస్థాయిలోని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తామని పార్టీ అధిష్ఠానం హామీ ఇచ్చిందని ఆయన అన్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రె్‌సను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం సముచితమన్నారు. 2009నుంచి రాజగోపాల్‌రెడ్డికి కాంగ్రె్‌సతో అనుబంధం ఉందని, ప్రజల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. కాంగ్రెస్‌ అమలు చేస్తున్న ఎన్నికల హామీలను ప్రజలకు వివరించి చైతన్య పరచాలన్నారు. నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కీలకంగా పని చేశారన్నారు. సభలో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ కుంభం శ్రీనివా్‌సరెడ్డి, కాంగ్రెస్‌ మునుగోడు ఇన్‌చార్జి పబ్బు రాజు, ఏఎంసీ చైర్మన్‌ ఉబ్బు వెంకటయ్య, వైస్‌ చైర్మన్‌ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, మాజీ ఎంపీపీ తాడూరు వెంకట్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ చిల్కూరి ప్రభాకర్‌రెడ్డి, సీతారామ చంద్రస్వామి దేవస్థానం చైర్మన్‌ బి.మురళి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఏనుగు రఘూమారెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీలు బొంగు జంగయ్య, ఉప్పు భద్రయ్య, మోగుదాల రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2025 | 01:06 AM