Donation: తిరుమలలో అన్నా లెజినోవా అన్నదానం
ABN , Publish Date - Apr 15 , 2025 | 05:22 AM
డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తమ కుమారుడు మార్క్ శంకర్ పేరిట తిరుమలలో సోమవారం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ పథకానికి రూ. 17 లక్షల విరాళం అందజేశారు.

భక్తులకు స్వయంగా వడ్డించిన పవన్ సతీమణి
కుమారుడి పేరిట అన్నప్రసాదాలకు 17 లక్షల విరాళం
తిరుమల, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తమ కుమారుడు మార్క్ శంకర్ పేరిట తిరుమలలో సోమవారం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ పథకానికి రూ. 17 లక్షల విరాళం అందజేశారు. అంతేగాక ఆమె స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. తర్వాత భక్తులందరితో కలిసి అన్నప్రసాదాలు స్వీకరించారు. అంతకుముందు ఆమె సుప్రభాత సేవలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు.
సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడిన నేపథ్యంలో మొక్కులు చెల్లించేందుకు ఆదివారం తిరుమలకు చేరుకున్న ఆమె డిక్లరేషన్పై సంతకం చేసి వరాహస్వామిని దర్శించుకుని తలనీలాలు సమర్పించిన విషయం తెలిసిందే. రాత్రికి తిరుమలలోనే బస చేసిన ఆమె సోమవారం వేకువజామున వైకుంఠం క్యూలైన్ ద్వారా స్వామివారి దర్శనానికి వెళ్లారు. రంగనాయక మండపంలో అన్నా లెజినోవాకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు.