ఆధార్ లేకున్నా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం
ABN , Publish Date - Mar 01 , 2025 | 05:08 AM
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (ఓజీహెచ్) సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధార్ కార్డు లేకపోయినా వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.

రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ.. పిల్ను ముగించిన హైకోర్టు
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (ఓజీహెచ్) సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధార్ కార్డు లేకపోయినా వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఆధార్ కార్డు లేదన్న పేరుతో వైద్యం నిరాకరించడం లేదని స్పష్టం చేసింది. ఓజీహెచ్లో ఆధార్ కార్డు లేదని చెప్పి రోగులను చేర్చుకోవడం లేదని పేర్కొంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజాయ్పాల్, జస్టిస్ రేణుక ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ ఆధార్ ఉన్నా లేకపోయినా వైద్యం అందిస్తున్నామని, భవిష్యత్తులో సైతం ఇదే విధానం కొనసాగుతుందని పేర్కొన్నారు. దీంతో పిల్ను ముగిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది.