మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి కన్నుమూత

ABN , First Publish Date - 2021-04-11T16:53:12+05:30 IST

అనంతపురం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత, హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి(80) కన్నుమూశారు.

మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి కన్నుమూత

మడకశిర: అనంతపురం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత, హిందూపురం మాజీ ఎమ్మెల్యే కామగానహళ్లి తిప్పేస్వామి(80) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. పరిగి మండలం సేవా మందిరంలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1941లో ఏప్రిల్ 6న జన్మించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సేవా మందిర్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి సొంత స్థలంలో తన తండ్రి ఎంఏ. లింగన్న పేరుతో విద్యాసంస్థలను ప్రారంభించిన ఆయన.. పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగానూ సేవలు అందించారు. అయితే ఆయన గత 15 ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.


తిప్పేస్వామి మృతితో జిల్లా రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. పలువురు సీనియర్ నాయకులు, వివిధ పార్టీల నేతలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు.  మాజీ మంత్రి రఘువీరారెడ్డి నివాళులర్పించి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా తిప్పేస్వామితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.  

Updated Date - 2021-04-11T16:53:12+05:30 IST