సందేశాత్మకంగా జయన్న కళారూపాలు

ABN , First Publish Date - 2020-02-16T09:35:30+05:30 IST

ప్రముఖ శిల్పకారుడు గొల్లపల్లి జయన్న శిల్పకళారూపాలు సందేశాత్మకంగా ఉన్నాయని కల్చరల్‌

సందేశాత్మకంగా జయన్న కళారూపాలు

కడప(కల్చరల్‌), ఫిబ్రవరి 15: ప్రముఖ శిల్పకారుడు గొల్లపల్లి జయన్న శిల్పకళారూపాలు సందేశాత్మకంగా ఉన్నాయని కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ కడప, అమరావతి, విజయవాడ సీఈవో డాక్టర్‌ శివనాగిరెడ్డి పేర్కొన్నారు. శనివారం రాయలసీమ టూరిజం కల్చరల్‌ సొసైటీ ప్రధాన కార్యదర్శి కొండూరు జనార్ధనరాజు సహకారంతో కడప రాజీవ్‌మార్గ్‌లోని రెడ్డి సేవాసమితిలో గొల్లపల్లి జయన్న తయారు చేసిన శిల్పకళల ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ జిల్లాలో పుట్టినవారు పట్టుదలతో శ్రమిస్తారని కితాబిచ్చారు. జయన్న తన ఆలోచనలను కళారూపాలుగా మలిచారన్నారు. పొయ్యిలో సగం కాలిన కొయ్యను శిల్పంగా మలచడం అద్భుతమన్నారు. రెడ్డి సేవాసమితి అధ్యక్షుడు లెక్కల కొండారెడ్డి మాట్లాడుతూ  జయన్న కళారూపాలతో కడప ఖ్యాతిని పెంచారన్నారు. వైవీయూ మాజీ ప్రత్యేకాధికారి ఆచార్య జి.శివారెడ్డి మాట్లాడుతూ జయన్న కళా ప్రదర్శనను ఎస్వీయూలో చూశానని, చక్కగా, ఆసక్తిగా ఉన్నాయన్నారు.


ఒక్కో శిల్పం ఒక్కో భావాన్ని పలికిస్తుందన్నారు. గొల్లపల్లి జయన్న మాట్లాడుతూ మూడో తరగతిలో తన స్వగ్రామం బద్వేలు చింతపూతలపల్లిలో  గీసిన జీర్ణాశయ బొమ్మను తన ఉపాధ్యాయుడు ప్రశంసించడంతో తన కళకు పదనుపెట్టినట్లు తెలిపారు. తన ప్రతిభ తనకు ఉద్యోగం తెచ్చిపెట్టిందని, తద్వారా వివధ రాష్ర్టాలు తిరిగి తన కళను మెరుగుపరచుకొన్నానన్నారు. అనంతరం జయన్నను అతిథులు ఘనంగా సత్కరించారు. యలమర్తి మధుసూదన్‌, పోతుల వెంకటరామిరెడ్డి, మానస చిన్నపరెడ్డి, సురభి కళాకారుడు జయరామ్‌, ఆదినారాయణరెడ్డి, బలకొండ గంగాధర్‌, ఎస్‌ఎండి భాషా, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-16T09:35:30+05:30 IST