టీడీపీ సంబరాలు
ABN , First Publish Date - 2023-03-18T01:13:42+05:30 IST
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ తరపున బరిలో నిలిచిన వేపాడ చిరంజీవిరావు ఓట్ల లెక్కింపుల్లో ఆధిక్యత కొనసాగుతుండడంతో శుక్రవారం జిల్లాలో శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.

పార్వతీపురం, మార్చి 17(ఆంధ్రజ్యోతి)/కురుపాం/జియ్యమ్మవలస: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ తరపున బరిలో నిలిచిన వేపాడ చిరంజీవిరావు ఓట్ల లెక్కింపుల్లో ఆధిక్యత కొనసాగుతుండడంతో శుక్రవారం జిల్లాలో శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. నాలుగు నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు ఆనందంలో మునిగితేలారు. నూతనోత్సాహంతో ర్యాలీలు నిర్వహించారు. పలుచోట్ల కేక్లు కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. జిల్లా కేంద్రం పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్సీ జగదీష్ , మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నేతలు బాణసంచా కాల్చారు. చినమేరంగిలో టీడీపీ సీనియర్ నేత శత్రుచర్ల విజయరామరాజు నివాసంలో కురుపాంం నియోజకవర్గ ఇన్చార్జి తోయక జగదీశ్వరి తదితరులు కేక్ కట్ చేశారు. కురుపాం బస్టాండ్లో నేతలు మందుగుండు సామగ్రి పేల్చి, డ్యాన్సులు చేస్తూ ఊరేగింపుగా సాగారు. ప్రతిఒక్కరూ ఇదే స్ఫూర్తితో పనిచేసి రానున్న ఎన్నికల్లో చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిగా చేయాలని నేతలు పిలుపునిచ్చారు.