Manipur Violence: నిపురుకప్పిన నిప్పులా చురాచాంద్‌పూర్.. సంపూర్ణ కర్ఫ్యూ

ABN , First Publish Date - 2023-05-03T21:01:59+05:30 IST

అల్లర్లతో అట్టుడికిన మణిపూర్‌ లోని చురాచాంద్‌పూర్ లో పరిస్థితి నివురుకప్పిని నిప్పులా..

Manipur Violence: నిపురుకప్పిన నిప్పులా చురాచాంద్‌పూర్.. సంపూర్ణ కర్ఫ్యూ

ఇంఫాల్: అల్లర్లతో అట్టుడికిన మణిపూర్‌ (Manipur)లోని చురాచాంద్‌పూర్ (Churachandpur)లో పరిస్థితి నివురుకప్పిని నిప్పులా ఉండటం, ఏ క్షణంలోనైనా మరిన్ని అల్లర్లకు అవకాశం ఉందనే సమాచారంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చురాచాంద్‌పూర్‌లో సంపూర్ణ కర్ఫ్యూ (Complete Curfew) విధిస్తున్నట్టు జిల్లా యంత్రాగం ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ సంపూర్ణ పబ్లిక్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. చురాచాంద్‌పూర్ జిల్లా రెవెన్యూ పరిధిలో, ముఖ్యంగా కాంగ్వాల్, తయిబాంగ్, చురాచాంద్‌పూర్ సబ్ డివిజన్లలో కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది.

చురాచాంద్‌పూర్ జిల్లా రెవెన్యూ పరిధిలోని ఆస్తులు, ప్రాణాలకు ముప్పు ఉందని, శాంతికి విఘాతం కలిగే అవకాశం ఉందని సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ నుంచి సమాచారం అందిందని, శాంతి, ప్రజాభద్రతకు ముప్పుకలిగించే చర్యలను తక్షణం నిరోధించాలని ఆయన ఆదేశించారని ఆ ప్రకటన పేర్కొంది. బయట వ్యక్తులను ఎవరినీ రానీయకుండా సంపూర్ణ కర్ఫ్యూ విధిస్తున్నట్టు తెలిపింది. ఎవరైనా ఇళ్ల నుంచి బయటకు వచ్చినట్లయితే వారి వల్ల ప్రజా శాంతికి, ప్రాణాలకు ముప్పు ఉందని భావించాల్సి వస్తుందని హెచ్చరించింది.

కాగా, దీనికి మందు ఏప్రిల్ 29న జిల్లాలో నైట్ కర్ఫ్యూని జిల్లా యంత్రాంగం విధించింది. తుయిబాంగ్ ఏరియాలోని రేంజ్ ఫారెస్ట్ అధికారి కార్యాలయానికి కొంతమంది వ్యక్తులు గత వారం మొదట్లో నిప్పుపెట్టారు. అగ్నిమాపక శకటాలు మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, లక్షలాది రూపాయల ప్రజా ఆస్తులు, అధికార డాక్యుమెంట్లు మంటల్లో దగ్ధమైనట్టు పోలీసులు తెలిపారు. దీనికి ఒక రోజు ముందు, చురాచాంద్‌పూర్ జిల్లాలోని సీఎం పాల్గొనాల్సిన సభా వేదికకు కొందరు నిప్పుపెట్టారు. దీంతో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఏప్రిల్ 27న పెద్ద సంఖ్యలో నిరసనకారులు సీఎం హాజరుకావలసిన జిమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం సభా వేదికకు నిప్పుపెట్టడంతో 100కు పైగా కుర్చీలు, జిమ్ సామాగ్రి ధ్వంసమయ్యాయి.

Updated Date - 2023-05-03T21:01:59+05:30 IST