Amit Shah: ఇప్పుడు కావాల్సింది.. శ్వేత విప్లవం 2.0
ABN , First Publish Date - 2023-03-19T01:39:04+05:30 IST
ప్రపంచ పాల ఉత్పత్తిలో అతిపెద్ద వాటాదారుగా భారత్ నిలవాలని కేంద్ర హోం, సహకార మంత్రి అమిత్ షా అన్నారు. ఆ దిశగా కేంద్రంతో రాష్ట్రాలు, సహకారసంఘాలు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.

2034 నాటికి 330 మిలియన్ టన్నుల
పాల ఉత్పత్తే లక్ష్యం: అమిత్ షా
గాంధీనగర్, మార్చి 18: ప్రపంచ పాల ఉత్పత్తిలో అతిపెద్ద వాటాదారుగా భారత్ నిలవాలని కేంద్ర హోం, సహకార మంత్రి అమిత్ షా అన్నారు. ఆ దిశగా కేంద్రంతో రాష్ట్రాలు, సహకారసంఘాలు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. గుజరాత్లోని గాంధీనగర్లో శనివారం జరిగిన 49వ పాడి పరిశ్రమ సదస్సులో అమిత్ షా మాట్లాడారు. 2033-34 నాటికి భారత్ 330 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి సాధించాలని లేదా ప్రపంచ పాల ఉత్పత్తిలో 33ు వాటా దక్కించుకోవాలన్నదే లక్ష్యమని చెప్పారు. డెయిరీ రంగం సర్వతోముఖాభివృద్ధికి మోదీ ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. దేశంలో పంచాయతీ స్థాయిలో 2 లక్షల కొత్త సహకార పాల ఉత్పత్తి కమిటీలు ఏర్పడితే.. వచ్చే సంవత్సరాల్లో అనుకున్న లక్ష్యం సులువుగా సాధించవచ్చని తెలిపారు.
దేశంలో ఇప్పుడు 220 మిలియ న్ టన్నుల పాల ఉత్పత్తి జరుగుతోందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా నిలవడమే కాకుండా మిల్క్ ప్రాసెసింగ్ పరికరాలను అత్యధికంగా ఎగుమతి చేసే దిశగా భారత్ ముందుకు సాగాలన్నారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో శ్వేత విప్లవం ఒకటని.. అదే లేకుంటే భారత్ ఎప్పటికీ స్వాలంబన పొందేది కాదని అమిత్ షా అభిప్రాయపడ్డారు. పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు ఇప్పుడు శ్వేత విప్లవం 2.0 అవసరముందని.. అందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. డెయిరీ రంగంలో సహకార నమూనాను బలోపేతం చేసి రైతులకు మరింత ప్రయోజనం చేకూరుస్తామని భరోసానిచ్చారు.