రేవంత్రెడ్డి పాదయాత్రకు ఏర్పాట్లు పూర్తి
ABN , First Publish Date - 2023-03-01T23:51:17+05:30 IST
గురువారం హుస్నాబాద్ నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పాదయాత్ర చేయనున్నారు.

హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్
జోడో యాత్రను విజయవంతం చేయాలి
మాజీ ఎమ్మెల్యే అలిగిరెడి ప్రవీణ్రెడ్డి
హుస్నాబాద్, మార్చి 1 : హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా గురువారం హుస్నాబాద్ నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. బుధవారం రాత్రి నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం కట్కూర్ క్రాస్ రోడ్డు వద్ద బస చేసిన రేవంత్రెడ్డి గురువారం ఉదయం 9 గంటలకు హనుమకొండ జిల్లా బీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకుంటారు. 10 గంటలకు గండిపల్లి ప్రాజెక్టును, 11 గంటలకు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సర్వాయిపేట సర్దార్ సర్వాయిపాపన్నకోటను సందర్శిస్తారు. మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు సిద్దిపేట జిల్లా కట్కూర్ క్రాస్ రోడ్డు నుంచి హాథ్ సే హాథ్ జోడో యాత్ర ప్రారంభమై అంతకపేట, చౌటపల్లి, జనగామ, తోటపల్లి, గాంధీనగర్, కిషన్నగర్ గ్రామాల మీదుగా సాయంత్రం 5 గంటలకు హుస్నాబాద్ పట్టణానికి చేరుకుంటారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించే కార్నర్ మీటింగ్లో రేవంత్రెడ్డిరెడ్డి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలో పెద్దఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గం నుంచి కార్యకర్తలను, ప్రజలను ఈ సమావేశానికి తరలిస్తున్నారు. దాదాపు 8 నుంచి 10 వేల మంది ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలున్నాయని మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్రెడ్డి తెలిపారు. ఈ యాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు.