Share News

YSRCP Vs TDP: తాడిపత్రిలో మళ్లీ రచ్చ.. ఏబీఎన్ రిపోర్టర్‌ను కాల్చేస్తానంటూ గన్ తీసి..!

ABN , Publish Date - Aug 20 , 2024 | 08:01 PM

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు, ఆ తర్వాత జరిగిన తాడిపత్రి నియోజకవర్గంలో జరిగిన గొడవలు అన్నీ ఇన్నీ కావు. కొద్దిరోజులుగా సైలెంట్‌గా ఉందని అనుకుంటున్న పరిస్థితుల్లో మళ్లీ వైసీపీ నేతలు రెచ్చిపోయారు. తాడిపత్రి ఏబీఎన్ రిపోర్టర్‌ రమణను కాల్చేస్తానంటూ గన్ తీసి వైసీపీ నేత కందిగోపుల మురళీ ప్రసాద్ రెడ్డి హల్‌చల్ చేశారు..

YSRCP Vs TDP: తాడిపత్రిలో మళ్లీ రచ్చ.. ఏబీఎన్ రిపోర్టర్‌ను కాల్చేస్తానంటూ గన్ తీసి..!

అనంతపురం జిల్లా: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు, ఆ తర్వాత జరిగిన తాడిపత్రి (Tadipatri) నియోజకవర్గంలో జరిగిన గొడవలు అన్నీ ఇన్నీ కావు. కొద్దిరోజులుగా సైలెంట్‌గా ఉందని ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితుల్లో మళ్లీ వైసీపీ (YSR Congress) నేతలు రెచ్చిపోయారు. ప్రశాంతంగా ఉన్న తాడిపత్రిలో కవ్వింపు చర్యలకు దిగిన వైసీపీ నేతలు రచ్చ రచ్చజేశారు. తాడిపత్రికి రావొద్దంటూ పోలీసులు చెప్పినా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Ketireddy Pedda Reddy) పట్టించుకోకుండా వచ్చేశారు. ఆయన రాకతో నియోజకవర్గంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అటు వైసీపీ.. ఇటు టీడీపీ శ్రేణులు ఒకరిపై మరొకరు దాడులు, ప్రతిదాడులు చేసుకున్నారు. చిన్నపాటి ఘర్షణ కాస్త.. ఇంటిపై దాడి చేసుకునేంత దాకా వెళ్లింది. దీంతో నియోజకవర్గంలో పాత రోజులు వచ్చాయని ప్రజలు భయపడిపోతున్నారు.


ketireddy-peddareddy.jpg

అసలేం జరిగింది..?

టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) నివాసం ముందు వెళ్తూ అనుచరులను వైసీపీ నేతలు రెచ్చగొట్టారు. ఈలలు, కేకలు వేస్తూ పెద్దారెడ్డి ప్రధాన అనుచరుడు, వైసీపీ నేత కందిగోపుల మురళిప్రసాద్ రెడ్డి హల్ చల్ చేశారు. దీంతో ఒక్కసారిగా బయటికొచ్చిన టీడీపీ శ్రేణులు, జేసీ అనుచరులు.. మురళి ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో వైసీపీ నేతల కార్లు, మురళి ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసమైంది. ఈ న్యూస్ కవరేజికి వెళ్లిన ఏబీఎన్ రిపోర్టర్ రమణను (ABN Andhrajyothy) కాల్చేస్తానంటూ ఇంట్లో ఉన్న గన్‌ను తీసుకొచ్చారు కందిగోపుల. పోలీసుల సమక్షంలోనే ఏబీఎన్ రిపోర్టర్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురి చేశారు. అంతేకాదు.. పలువురు జేసీ అనుచరులకు గన్ చూపిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరగడం గమనార్హం. కవరేజీకి వచ్చిన జర్నలిస్టుపై తుపాకి గురిపెట్టడమేంటి..? ఇంత దారుణమా..? అంటూ జిల్లా జర్నలిస్టు యూనియన్లు, ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. కందిగోపులపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ABN-Reporter-Ramana.jpg


భారీగా మొహరింపు..

వైసీపీ నేతల ఈ కవ్వింపు చర్యలతో తాడిపత్రి నియోజకవర్గంలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉన్నతాధికారుల ఆదేశాలు, హైటెన్షన్‌తో ఎస్పీ జగదీష్ తాడిపత్రి చేరుకున్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం వద్ద పోలీసు బలగాలు భారీగా మొహరించాయి. ఎక్కడా ఎలాంటి గొడవ జరగకుండా పోలీసులు చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు బందోబస్తుతోనే తాడిపత్రి నుంచి పెద్దారెడ్డిని బయటికి తీసుకెళ్లారు. దీంతో పరిస్థితులు కాస్త అదుపులోనికి వచ్చినట్లేనని తెలుస్తోంది. ఇవాళ రాత్రికి మళ్లీ ఎక్కడైనా గొడవలు జరగొచ్చేమో అనే అనుమానంతో పోలీసులు అటు వైసీపీ.. ఇటు టీడీపీ ఎమ్మెల్యే ఇంటి వద్దే ఉన్నారు. అయినా తాడిపత్రికి రావొద్దని పోలీసులు చెప్పినా పెద్దారెడ్డి రావడమేంటి..? జేసీ అనుచరులను వైసీపీ నేత కందిగోపుల రెచ్చగొట్టడం ఏంటి..? ఈ పరిణామాలను కాస్త నిశితంగా పరిశీలిస్తే ఇదంతా పనిగట్టుకుని చేస్తున్నదే అన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోందని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.

Tadipatri-Issue.jpg

Updated Date - Aug 20 , 2024 | 09:03 PM