Share News

Budda Venkanna: పదవులు వస్తాయి.. పోతాయి.. కానీ కమిట్మెంట్ ముఖ్యం

ABN , Publish Date - Jun 29 , 2024 | 01:28 PM

విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)ని టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, చెన్నుపాటి శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. రాజకీయాల్లో పదవులు వస్తాయి.. పోతాయి.. కానీ కమిట్మెంట్ చాలా ముఖ్యమని.. అటువంటి కమిట్మెంట్ ఉన్న నేత కేశినేని శివనాథ్ అని పేర్కొన్నారు.

Budda Venkanna: పదవులు వస్తాయి.. పోతాయి..  కానీ కమిట్మెంట్ ముఖ్యం

విజయవాడ: విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)ని టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, చెన్నుపాటి శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. రాజకీయాల్లో పదవులు వస్తాయి.. పోతాయి.. కానీ కమిట్మెంట్ చాలా ముఖ్యమని.. అటువంటి కమిట్మెంట్ ఉన్న నేత కేశినేని శివనాథ్ అని పేర్కొన్నారు. అవతల వారు వ్యక్తిగతంగా దూషించినా సమన్వయంతో ఉన్నారన్నారు. ఎప్పుడు వారి ఇంట్లో వాళ్లని ఒక్క మాట కూడా అనకుండా సంస్కారం చూపిన గొప్ప వ్యక్తి కేశినేని చిన్ని అని బుద్దా వెంకన్న కొనియాడారు. నేడు తిరుగులేని విజయంతో చిన్ని రికార్డు సృష్టించారని తెలిపారు.


ఆయన చేసిన సర్వీసు ప్రజల్లోకి బాగా వెళ్లిందని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. కష్టం ఉందని కలిసిన‌ ప్రతి వ్యక్తి కి చిన్ని అండగా నిలిచారన్నారు. ఆర్ధికంగా, ఉద్యోగం, ఉపాధి, విద్యా పరంగా సేవలు అందించారన్నారు. కేశినేని చిన్ని ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా హ్యాట్రిక్ సాధిస్తారన్నారు. అందుకే తామంతా కలిసికట్టుగా పని చేస్తామని బుద్దా వెంకన్న తెలిపారు. పార్లమెంటు భవనంలో మూడోసారి ప్రమాణ స్వీకారం చేసే వరకూ తాను వెన్నంటే ఉంటానన్నారు. శ్రీరాముడికి ఆంజనేయుడు ఎలాగో.. సీఎం చంద్రబాబుకు తాను కూడా అంతేనని బుద్దా వెంకన్న తెలిపారు.


చంద్రబాబు సీఎంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. గతంలో కేశినేని నాని ఎంపీగా ఎన్నికైన తరువాత చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని బుద్దా వెంకన్న గుర్తు చేశారు. అందువల్లే తామంతా ఆయన్ని వ్యతిరేకించాల్సి వచ్చిందన్నారు. ఇప్పుడు కేశినేని చిన్ని సారధ్యంలో మేమంతా పని చేస్తామని స్పష్టం చేశారు. కేశినేని శివనాథ్ చిన్ని మాకు నాయకత్వం వహిస్తారని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో మేమంతా కేశినేని చిన్నితో కలిసి ప్రయాణం చేస్తామని వెల్లడించారు. ఆయనపై అనవసరంగా నోరు పారేసుకుంటే మా పోరాటం ఇక్కడ నుంచే మొదలు పెడతామని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.

Updated Date - Jun 29 , 2024 | 01:51 PM