ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Central Educational Department : సీబీఐకి నీట్‌

ABN, Publish Date - Jun 23 , 2024 | 04:36 AM

రెండు వారాలకు పైగా దేశవ్యాప్తంగా విద్యార్థులు జరుపుతున్న పోరాటం, జాతీయ స్థాయిలో బలపడిన విపక్షం ఒత్తిడి ఫలించాయి. జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్‌-యూజీ, యూజీసీ-నెట్‌ ప్రవేశ పరీక్షల లీక్‌ ...

  • పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్‌టీఏ డీజీపై వేటు.. సంస్కరణలకు కమిటీ

  • నేడు జరగాల్సిన నీట్‌-పీజీ వాయిదా

  • ఎల్లుండి నుంచి పార్లమెంటు సమావేశాల

  • నేపథ్యంలో కేంద్రం నష్ట నివారణ చర్యలు

  • ఫలించిన విద్యార్థులు, విపక్షాల ఒత్తిడి

  • పరీక్షల పవిత్రత కాపాడతాం: కేంద్రం

  • లీక్‌ రాకెట్‌ ముందు మోదీ నిస్సహాయం

  • అసమర్థ నాయకత్వంతో

  • పిల్లల భవిష్యత్తుకు ప్రమాదం: రాహుల్‌

న్యూఢిల్లీ, జూన్‌ 22: రెండు వారాలకు పైగా దేశవ్యాప్తంగా విద్యార్థులు జరుపుతున్న పోరాటం, జాతీయ స్థాయిలో బలపడిన విపక్షం ఒత్తిడి ఫలించాయి. జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్‌-యూజీ, యూజీసీ-నెట్‌ ప్రవేశ పరీక్షల లీక్‌ వ్యవహారాలపై విమర్శలు వెల్లువెత్తి, ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బ తినడం, సోమవారం నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో అదే ప్రధాన అంశం అయ్యే పరిస్థితి కనిపించడంతో కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలను ప్రారంభించింది.

శనివారం మధ్యాహ్నం నుంచి చకచకా పలు నిర్ణయాలు తీసుకుంది. మొదట నీట్‌ పరీక్షను నిర్వహించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్రక్షాళనకు ఉన్నత స్థాయి కమిటీని వేసింది. తర్వాత ఎన్‌టీఏ అధిపతిని పదవి నుంచి తప్పించింది. అసలు ఎన్‌టీఏకు లోపాల్లేకుండా పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉందో లేదో తేల్చుకొనే వరకు పరీక్షల నిర్వహణకు విరామం ప్రకటించే కార్యక్రమంలో భాగంగా ఆదివారం జరగాల్సిన నీట్‌-పీజీ పరీక్షను వాయిదా వేసింది.

చివరగా శనివారం రాత్రి నీట్‌ లీక్‌ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. లీక్‌ మూలాలను తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు కోసమే సీబీఐకి అప్పగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సీబీఐ దర్యాప్తు నిర్ణయానికి కొద్ది గంటల ముందు కేంద్రం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) డైరెక్టర్‌ జనరల్‌ సుబోధ్‌ కుమార్‌సింగ్‌పై వేటేసింది. ఆయన స్థానంలో ఇండియా ట్రేడ్‌ ప్రమోషన్‌ ఆర్గనైజేషన్‌ చైర్మన్‌ అయిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ప్రదీ్‌పసింగ్‌ కరోలాకు ఎన్‌టీఏను అదనపు బాధ్యతగా అప్పగించారు. సుబోధ్‌ కుమార్‌ సింగ్‌ను కంపల్సరీ వెయిట్‌లో ఉంచారు.


సుబోధ్‌ కుమార్‌ సింగ్‌ ఎన్‌టీఏ డీజీ హోదాలో దాదాపు 1500 మంది విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు ఇచ్చి నీట్‌-యూజీ పరీక్షపై వివాదానికి తెర తీశారు. సుబోధ్‌పై వేటు సమయంలోనే ఆదివారం (జూన్‌ 23న) జరగాల్సిన నీట్‌-పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేశారు. వరుసగా రెండు పరీక్షల ప్రశ్నపత్రాలు లీకయిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ముందు ఎన్‌టీఏ పరీక్షల నిర్వహణ సామర్థ్యాన్ని అంచనా వేయాలని నిర్ణయించారు. ఈ పరీక్ష మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనేది తర్వాత ప్రకటించనున్నారు.

నీట్‌ తదితర పోటీ పరీక్షలను నిర్వహిస్తున్న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)ను సంస్కరిస్తున్నట్లు శనివారం మధ్యాహ్నం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ఇస్రో మాజీ చైర్మన్‌ కె.రాధాకృష్ణన్‌ నేతృత్వంలో ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ రెండు నెలల్లో నివేదిక సమర్పిస్తుందని తెలిపింది. ఎన్‌టీఏ పరీక్షలను సజావుగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం కోసం, ఎన్‌టీఏ డేటాను భద్రపరిచే పద్ధతులను, ఎన్‌టీఏ నిర్మాణం, పనితీరును, పరీక్షలు నిర్వహించే తీరును మెరుగు పరచడానికి సలహాలు ఇస్తుందని చెప్పింది. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ వీసీ బి.జె.రావు, ఢిల్లీ ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా, ఐఐటీ మద్రా్‌సకు చెందిన ప్రొఫెసర్‌ రమణమూర్తి, పంకజ్‌ బన్సల్‌, ఢిల్లీ ఐఐటీకి చెందిన ప్రొఫెసర్‌ ఆదిత్య మిట్టల్‌, విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి గోవింద్‌ జైశ్వాల్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని ప్రకటించింది.

పరీక్షల వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు తొలి అడుగని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. అన్ని రకాల అక్రమాలకు అవకాశాలను మూసేస్తామని చెప్పారు. మొత్తం ఎన్‌టీఏ వ్యవస్థనే ప్రక్షాళిస్తామని ప్రకటించారు. పేపర్‌ కూర్పు మొదలు ఫలితాల విడుదల వరకు అన్ని దశల్లో ఇప్పటికే ఉన్న విధానాలను ఈ కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. ఇప్పటికే ఎన్‌టీఏ ఆధ్వర్యంలో జరిగిన నీట్‌, యూజీసీ-నెట్‌ పరీక్షలు లీక్‌ అయినట్లు తేలింది. నీట్‌పై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, యూసీజీ-నెట్‌ను రద్దు చేశారు.


విపక్షం ఒత్తిడి పని చేసింది

ఎన్‌టీఏ పరీక్షలకు సంబంధించి పదేపదే లీకుల ఆరోపణలు రావడం, విద్యార్థులకు కలిగిన ఇబ్బందులు, వారిలో వ్యక్తమైన ఆగ్రహావేశాలు, బలం పుంజుకున్న విపక్షం ఒత్తిడి... వెరసి అన్నీ కలిసి సుబోధ్‌ కుమార్‌ సింగ్‌పై వేటు వేయక తప్పని పరిస్థితిని కల్పించాయి. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు కూడా ప్రభుత్వంపై పని చేశాయి. ఎన్‌టీఏను ప్రక్షాళిస్తామని విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్వయంగా చెప్పిన నేపథ్యంలో ప్రక్షాళనలో సుబోధ్‌ కుమార్‌ సింగ్‌ను వెళ్లగొట్టాడాన్ని భాగంగా చూడవచ్చని అంటున్నారు. శనివారమే ఆయన లీకుల ఆరోపణల నేపథ్యంలో ఎన్‌టీఏ అగ్ర నాయకత్వం మొత్తం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ధర్మేంద్ర ప్రధాన్‌ను చర్యలు కనిపించాలని ఆదేశించారు. ఫలితంగానే వేటు పడిందని భావిస్తున్నారు. పేపర్‌ లీక్‌ ఆరోపణను మూలాల వరకు దర్యాప్తు చేసి, అసలు దోషులను పట్టుకోవడం తమ ముందు ఉన్న ప్రధాన కర్తవ్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టులో నీట్‌ లీకేజీ కేసు జూలై 8న విచారణకు రానుంది. కోర్టు కూడా నీట్‌ రద్దు చేయలేమని, ఆరోపణల నిజానిజాలు తేల్చమని చెప్పింది. ఈ నేపథ్యంలో దర్యాప్తులో పురోగతి సాధించడం మీద ప్రభుత్వం దృష్టి సారించింది. పరీక్షల పవిత్రతను, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటానికి తాము కట్టుబడి ఉన్నామని శనివారం రాత్రి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.


నీట్‌-పీజీ తేదీలు మళ్లీ ప్రకటిస్తారు

వరుసగా రెండు పరీక్షల ప్రశ్నపత్రాలు లీకయిన నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన నీట్‌ పీజీ పరీక్షలను వాయిదా వేశారు. ముందు ఎన్‌టీఏ పరీక్షల నిర్వహణ సామర్థ్యాన్ని అంచనా వేయాలని నిర్ణయించారు. ఈ పరీక్ష మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనేది తర్వాత ప్రకటించనున్నారు. ఈ పరీక్షలు కూడా ఎన్‌టీఏ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. జూన్‌ 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు జరగాల్సిన సీఎ్‌సఐఆర్‌ యూజీసీ నెట్‌ పరీక్షలను శుక్రవారం రాత్రి వాయిదా వేశారు. లాజిస్టికల్‌ సమస్యల కారణంగా వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. నీట్‌-పీజీ వాయిదా వార్త వెలువడగానే కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ స్పందించారు. ఏదో ఒక పరీక్ష రద్దు/వాయిదా లేకుండా రాత్రి తెల్లారడం లేదని ఎద్దేవా చేశారు. మోదీ నాయకత్వంలో విద్యావ్యవస్థ కుళ్లిపోయిందని చెప్పడానికి నీట్‌-పీజీ వాయిదా మరో దురదృష్టకర ఉదాహరణ అని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. పేపర్‌ లీక్‌ రాకెట్‌ ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఏమీ చేయలేని నిస్సహాయుడిగా మారారని అన్నారు. ఆయన అసమర్థ ప్రభుత్వం పిల్లల భవిష్యత్తుకు పెద్ద ప్రతిబంధకం కానుందని చెప్పారు.

Updated Date - Jun 23 , 2024 | 04:36 AM

Advertising
Advertising