Share News

సూర్యాపేట కాంగ్రెస్‌ నేత.. వడ్డె ఎల్లయ్య మృతదేహం లభ్యం

ABN , Publish Date - May 09 , 2024 | 06:30 AM

రియల్‌ఎస్టేట్‌ వివాదాలతో కిడ్నాపై.. ఆపై దారుణ హత్యకు గురైన సూర్యాపేట బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వడ్డె ఎల్లయ్య మృతదేహం లభ్యమైంది. ఇరవై రోజుల క్రితం ఎల్లయ్య ప్రత్యర్థి, నాగారం మండలం మాచిరెడ్డిపల్లికి చెందిన శ్రీకాంతాచారి పథకం ప్రకారం అతణ్ని ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేటకు రప్పించి, అపహరించి,

సూర్యాపేట కాంగ్రెస్‌ నేత.. వడ్డె ఎల్లయ్య మృతదేహం లభ్యం

జగ్గయ్యపేటలోనే.. సగం కాల్చి, ఖననం చేసిన నిందితులు

కేసు నుంచి బయటపడేందుకే తప్పుడు సమాచారం

సూర్యాపేట రూరల్‌, మే 8: రియల్‌ఎస్టేట్‌ వివాదాలతో కిడ్నాపై.. ఆపై దారుణ హత్యకు గురైన సూర్యాపేట బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వడ్డె ఎల్లయ్య మృతదేహం లభ్యమైంది. ఇరవై రోజుల క్రితం ఎల్లయ్య ప్రత్యర్థి, నాగారం మండలం మాచిరెడ్డిపల్లికి చెందిన శ్రీకాంతాచారి పథకం ప్రకారం అతణ్ని ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేటకు రప్పించి, అపహరించి, హతమార్చిన విషయం తెలిసిందే. భార్యాభర్తల పంచాయితీ తీర్చాలంటూ అపర్ణ అనే మహిళతో ఎల్లయ్యను జగ్గయ్యపేటకు రప్పించిన శ్రీకాంతాచారి.. అక్కడి రైల్వేస్టేషన్‌ రోడ్‌ సమీపంలో హతమార్చాడు. ఈ కేసును సీరియ్‌సగా తీసుకున్న పోలీసులు.. శ్రీకాంతాచారిని అదుపులోకి తీసుకుని, ప్రశ్నిస్తే.. హత్యకేసు వెలుగులోకి వచ్చింది. అయితే.. మృతదేహం లభించకపోతే.. తాము కేసు నుంచి బయట పడవచ్చనే ఉద్దేశంతో శ్రీకాంతాచారి పోలీసులను తప్పుదోవ పట్టించాడు. చేపల లారీలో మృతదేహాన్ని విశాఖకు తీసుకెళ్లి.. అక్కడ సముద్రంలో పారేసినట్లు వాంగ్మూలమిచ్చాడు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అక్కడ గాలింపు చేపట్టారు.


పశువుల కాపరుల సమాచారంతో..

బుధవారం ఉదయం జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామ శివారులో ఏదో మృతదేహం దుర్వాసన వస్తోందంటూ పశువుల కాపరులు గ్రామ పెద్దలకు సమాచారం అందించారు. వారి ద్వారా విషయం తెలుసుకున్న వీఆర్వో బాబూరావు.. పోలీసులకు తెలిపారు. జగ్గయ్యపేట సీఐ జానకీరాం తన సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్నారు. దుర్వాసన వస్తున్న ప్రాంతంలో తాజాగా పూడ్చిన ఓ గోతి కనిపించడంతో.. అక్కడ తవ్వించారు. సగం కాలిన శవాన్ని వెలికి తీశారు. జగ్గయ్యపేట తహసీల్దార్‌ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆ మృతదేహం ఎల్లయ్యదేనని గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో.. వారు మృతదేహాన్ని గుర్తించారు. నిందితుడు శ్రీకాంతాచారి పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే విశాఖ సముద్రంలో పారేశామని చెప్పారని సీఐ వివరించారు. శ్రీకాంతాచారి తొలుత ఎల్లయ్య మృతదేహాన్ని కాల్చేందుకు ప్రయత్నించారని చెప్పారు. మృతదేహం సగం కాలడంతో.. పాతిపెట్టినట్లు పేర్కొన్నారు. కాగా.. బుధవారం సాయంత్రం సూర్యాపేట జిల్లాలోని ఎల్లయ్య స్వగ్రామం యార్కారంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఎల్లయ్య మాజీ నక్సలైట్‌ కావడంతో.. అంత్యక్రియలకు పలువురు మాజీ మావోయిస్టులు హాజరయ్యారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, తెలంగాణ పర్యాటక శాఖ చైర్మన్‌ పటేల్‌ రమేశ్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై.. ఎల్లయ్య మృతదేహానికి నివాళులు అర్పించారు. కాగా.. ఎల్లయ్య అంత్యక్రియలను ఆయన పెద్దకుమార్తె జరిపించారు.

Updated Date - May 09 , 2024 | 06:30 AM