ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth : తెలంగాణ ఓ పిడికిలి

ABN, Publish Date - Sep 18 , 2024 | 03:06 AM

తెలంగాణ రాష్ట్రం.. నాలుగు కోట్ల మంది ప్రజల పిడికిలి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో అన్ని జాతులు, కులాలు, మతాలు కలిసికట్టుగా ఉంటాయన్న సందేశం ఇందులో ఇమిడి ఉందన్నారు.

  • 4 కోట్ల మంది ప్రజల ఐక్యతే దీని సందేశం

  • ఈ ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరి యత్నం

  • సెప్టెంబరు 17ను రాజకీయం చేయడం తగదు

  • ప్రజాకాంక్షల మేరకే ‘ప్రజా పాలన దినోత్సవం’

  • గత పదేళ్లలో సాంస్కృతిక, ఆర్థిక విధ్వంసం

  • తెలంగాణ అస్తిత్వం కుటుంబ అస్తిత్వమైంది

  • మా ప్రభుత్వం వచ్చాక పునరుజ్జీవానికి నాంది

  • హక్కులు సాధించుకునేందుకే ఢిల్లీ పర్యటనలు

  • ఫాంహౌస్‌ సీఎంను కాదు.. పనిచేసే సీఎంను

  • ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు: రేవంత్‌

  • పబ్లిక్‌ గార్డెన్స్‌లో ప్రజా పాలన దినోత్సవం

  • పటేల్‌కు.. బీజేపీకి ఏంటి సంబంధం?

  • విలీనంలో బీజేపీకి ఎలాంటి పాత్రా లేదు

  • గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ నియోజకవర్గానికో ఎంఎస్ఎంఈ పార్కునేడు కొత్త విధానాన్ని ఆవిష్కరించనున్న సీఎం

హైదరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం.. నాలుగు కోట్ల మంది ప్రజల పిడికిలి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో అన్ని జాతులు, కులాలు, మతాలు కలిసికట్టుగా ఉంటాయన్న సందేశం ఇందులో ఇమిడి ఉందన్నారు. ఈ ఐక్యతను, తెలంగాణ సమైక్యతను దెబ్బతీసే విధంగా కొందరు వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నించడం క్షమించరాని విషయమన్నారు. అయితే బిగించిన పిడికిలి.. కొండలనైనా పిండి చేయగలదని, ఐక్యంగా ఉండే తెలంగాణకు బిగించిన పిడికిలికి ఉన్నంత శక్తి ఉందని చెప్పారు. సెప్టెంబరు 17ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ వేడుకలను మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించింది. పబ్లిక్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబరు 17ను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూడడం అవివేకమన్నారు.

గత పాలకులు తెలంగాణ సంస్కృతి అంటే తమ ఇంటి సంస్కృతిగా, తెలంగాణ అస్థిత్వమంటే తమ కుటుంబ అస్థిత్వంగా భావించారని ఆరోపించారు. తెలంగాణ జాతి తమ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉందని భ్రమించారని ధ్వజమెత్తారు. కులమతాలకు అతీతంగా అంతా ఏకమై నిజాంనే మట్టికరిపించిన చరిత్ర తెలంగాణకు ఉందన్న విషయాన్ని విస్మరించారని అన్నారు. గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో సాంస్కృతికంగా, ఆర్థికంగా విధ్వంసానికి గురైన తెలంగాణ పునరుజ్జీవానికి తాము కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రపంచ వేదికపై రాష్ర్టాన్ని ‘ఫ్యూచర్‌ స్టేట్‌’గా నిలబెట్టబోతున్నామన్నారు. ఇటీవల ప్రకృతి ప్రకోపానికి గురైన కేరళ లాంటి పరిస్థితి తెలంగాణకు రాకుండా పర్యావరణ పునరుజ్జీవం కల్పించేందుకే హైడ్రాను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...


  • అమరుల త్యాగాలను పలుచన చేయొద్దు..

‘‘తెలంగాణ బానిస సంకెళ్లను తెంచిన చరిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబరు 17న ఇదే హైదరాబాద్‌ గడ్డపై ఆవిష్కృతమైంది. తెలంగాణ అంటే త్యాగం. ఆ త్యాగాలకు ఆద్యుడు దొడ్డి కొమురయ్య. నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. ఆనాటి సాయుధ పోరాటంలో అమరులైన వీరులకు ఈ సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నా. సెప్టెంబరు 17 తెలంగాణ ప్రస్థానంలో కీలకమైన రోజు. ఈ శుభదినాన్ని ఎలా నిర్వచించుకోవాలన్న విషయంలో ఇప్పటివరకు భిన్నాభిప్రాయాలున్నాయి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించాం. స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదని ప్రజా ప్రభుత్వం భావించింది. అందుకే.. ఈ శుభదినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ ప్రజా పాలన దినోత్సవంగా నామకరణం చేశాం. ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష. నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి. మనం జాగ్రత్తగా గమనిస్తే.. తెలంగాణ భౌగోళిక స్వరూపం బిగించిన పిడికిలి మాదిరిగా ఉంటుంది. ఇది నాలుగు కోట్ల ప్రజల పిడికిలి.. పోరాటానికి సంకేతం. ఇది ఎప్పటికీ అలాగే ఉండాలి. పెత్తందార్లపై, నియంతలపై ఎప్పటికీ పోరాట సంకేతంగా ఉండాలి. గడచిన పదేళ్లలో తెలంగాణ నియంత పాలనలో మగ్గిపోయింది. ఆ బానిస సంకెళ్లను తెంచడానికి సెప్టెంబరు 17 మాకు స్ఫూర్తి.

  • కుటుంబ అస్తిత్వంగా భావించారు

ప్రాణత్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన పారదర్శకంగా, బాధ్యతగా ఉండాలి. ప్రతి నిర్ణయంలో ప్రజల కోణం ఉండాలి. మేం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం. పదేళ్లలో విధ్వంసమైన తెలంగాణను సాంస్కృతికంగా, ఆర్థికంగా పునరుజ్జీవం చేయాల్సిన అవసరాన్ని గుర్తించాం. గత పాలకులు తెలంగాణను కుటుంబ అస్తిత్వంగా భావించారు. మేం అధికారంలోకి రాగానే సాంస్కృతిక పునరుజ్జీవానికి నాంది పలికాం. అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించాం. పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుక్కలు చింపిన విస్తరిలా తయారు చేశారు. 7 లక్షల కోట్ల అప్పు.. ప్రతి నెలా 6500 కోట్ల మేర అసలు, వడ్డీ కలిపి బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితుల్లో మేం బాధ్యతలు స్వీకరించాం. అప్పుల పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. కేంద్రం నుంచి మనకు హక్కుగా రావాల్సిన ప్రతి పైసాతెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ విషయంలో భేషజాలకు పోకుండా నేనే స్వయంగా పలుసార్లు ఢిల్లీ వెళ్లా. ప్రధానితో సహా కేంద్ర మంత్రులందరికీ వినతి పత్రాలు ఇస్తున్నాం.


  • ఫాంహౌస్‌ ముఖ్యమంత్రిని కాదు

నా ఢిల్లీ పర్యటనల మీద కొందరు విమర్శలు చేస్తున్నారు. కాలు కదపకుండా ఇంట్లో సేద తీరడానికి నేను ఫాంహౌస్‌ ముఖ్యమంత్రిని కాదు.. పని చేసే ముఖ్యమంత్రిని. నా స్వార్థం కోసమో, వ్యక్తిగత పనుల కోసమో ఢిల్లీకి వెళ్లడం లేదు. ఢిల్లీ ఏ పాకిస్థాన్‌ లోనో, బంగ్లాదేశ్‌లోనో లేదు. అది మన దేశ రాజధాని. ఇది ఫెడరల్‌ వ్యవస్థ. రాష్ర్టాలకు, కేంద్రానికి మధ్య అనేక అంశాలుంటాయి. రాష్ట్రం నుంచి మనం పన్నుల రూపంలో కొన్ని వేల కోట్లు కడుతున్నాం. అందులో మన వాటా తిరిగి తెచ్చుకోవడం మన హక్కు. ఆ హక్కుల సాధన కోసం ఎన్ని సార్లయినా ఢిల్లీకి వెళతా. ఇటీవల 16వ ఆర్థిక సంఘం ముందు కూడా గట్టిగా మన వాదనలు వినిపించాం. మన రాష్ర్టాన్ని ప్రపంచ వేదికపై ‘ఫ్యూచర్‌ ేస్టట్‌’ గా ప్రచారం చేస్తున్నాం. పెట్టుబడుల ఆకర్షణలో ఇదొక వ్యూహాత్మక ప్రయత్నం. ఇటీవల బేగరి కంచె వద్ద ఫోర్త్‌ సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం. మూసీ సుందరీకరణ హైదరాబాద్‌ రూపురేఖలను మార్చేస్తుందనడంలో సందేహం లేదు.

  • కేరళ లాంటి పరిస్థితి రాకూడదు

తెలంగాణ క్లీన్‌ స్టేట్‌గా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్థిక, సాంస్కృతిక పునరుజ్జీవంతోపాటు పర్యావరణ పునరుజ్జీవం కూడా జరగాలి. అందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం. ఒకప్పుడు లేక్‌ సిటీగా పేరు పొందిన హైదరాబాద్‌.. ఫ్లడ్స్‌ సిటీగా దిగజారిపోవడానికి కారణం గత పదేళ్ల పాలకుల పాపమే. వాటి ప్రక్షాళన కోసమే హైడ్రా ఏర్పాటు చేశాం. ఇటీవల కేరళలో ప్రకృతి విలయతాండవం మనం చూశాం. ఆ పరిస్థితి హైదరాబాద్‌కు రాకూడదు. హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదు.. స్వార్థం లేదు. అదొక పవిత్ర కార్యం.. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. కొందరు భూ మాఫియాగాళ్లు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. హైదరాబాద్‌ భవిష్యత్తుకు హైడ్రా గ్యారెంటీ ఇస్తుంది. సంక్షేమం విషయంలో కాంగ్రె్‌సకు ట్రాక్‌ రికార్డు ఉంది. మా రికార్డును మేమే తిరగరాస్తున్నాం. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఏకకాలంలో 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేశాం. 87 కోట్ల మంది ఆడబిడ్డలు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా లబ్ధి పొందారు. రూ.500కే వంట గ్యాస్‌ ఇచ్చి 43 లక్షల కుటుంబాలకు మేలు చేశాం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్తు వినియోగం ఉన్న ఇళ్లకు గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్తు ఇస్తున్నాం.


  • ఈ ఏడాదిలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు..

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఈ ఏడాది నాలుగున్నర లక్షల ఇళ్లు నిర్మించబోతున్నాం. నేతన్నల కోసం ఇటీవల ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీని ప్రారంభించుకున్నాం. తెలంగాణ విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశాం. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీకి పునాదిరాయి వేశాం. మూడు నెలల్లో 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్షలు ఎలాంటి వివాదం లేకుండా పూర్తి చేశాం. 11,062 పోస్టులతో ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నిర్వహించాం. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నాం. గల్ఫ్‌లో మరణించిన కార్మికుల కుటుంబానికి రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించాం. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నాలుగు కోట్ల ప్రజల సంక్షేమమే గీటురాయిగా పాలన ఉంటుంది. సెప్టెంబరు 17 ఇకపై ప్రజా పాలన దినోత్సవం. తెలంగాణ ప్రజలే ఈ రాష్ట్ర ప్రస్థానానికి నావికులు. వారి ఆలోచనలే మా ఆచరణ. వారి ఆకాంక్షలే... మా కార్యాచరణ’’ అని సీఎం రేవంత్‌ అన్నారు. అంతకుముందు ఉదయం నాంపల్లిలోని అమరవీరుల స్తూపానికి సీఎం నివాళులర్పించారు.

Updated Date - Sep 18 , 2024 | 03:11 AM

Advertising
Advertising