Share News

Abhishek Singhvi: నేడు రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న సింఘ్వీ

ABN , Publish Date - Aug 19 , 2024 | 07:45 AM

ఏఐసీసీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ ఈరోజు(సోమవారం) రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీలో నామినేషన్ వేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సింఘ్వీ నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Abhishek Singhvi: నేడు రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న సింఘ్వీ
Abhishek Singhvi

హైదరాబాద్: ఏఐసీసీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ ఈరోజు(సోమవారం) రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీలో నామినేషన్ వేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సింఘ్వీ నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఒక్కొక్క సెట్‌కు పది మంది ఎమ్మెల్యేల సంతకాలు చేస్తారు. నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారు. అభిషేక్‌ మను సింఘ్వీని రాజ్యసభ సభ్యుడిగా సీఎల్పీ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిని కావడం గర్వంగా ఉందని సింఘ్వీ చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో రాజ్యసభతో పాటు కోర్టుల్లో తన వాదన బలంగా వినిపిస్తానని అభిషేక్ స్వింఘ్వీ తెలిపారు.


మరోపైపు.. అభిషేక్‌ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించింది. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఖాళీ అయిన 12 రాజ్యసభ స్థానాలకు సెప్టెంబరు 3న ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ విషయానికి వస్తే బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కే కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి గత నెల 5న రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది.


ఫిబ్రవరిలో మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగగా.. శాసనసభలో కాంగ్రెస్‌కున్న సంఖ్యాబలాన్ని బట్టి రెండు సీట్లు దక్కాయి. వాటిలో ఒక సీటును ఏఐసీసీ తన కోటా కింద తీసుకోవాలని భావించినా.. ఇక్కడి సామాజిక సమీకరణాల దృష్ట్యా రెండు సీట్లనూ టీపీసీసీకే ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఖాళీ అయిన సీటును ఏఐసీసీ కోటా కింద తీసుకుంది. సింఘ్వీని అభ్యర్థిగా నిర్ణయించింది. ప్రస్తుతం శాసనసభలో ఈ సీటుకు పోటీ పడే సంఖ్యా బలం ఏ పార్టీకీ లేనందున సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నెల 27న నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తవుతుంది.


అనంతరం సింఘ్వీ ఎన్నికైనట్టు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించనున్నారు. సింఘ్వీ పదవీ కాలం ఏప్రిల్‌ 9, 2026 వరకు (ఒక ఏడాది ఏడు నెలలు) ఉంటుంది. ఫిబ్రవరిలో హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి సింఘ్వీని రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్‌ ఎంపిక చేసినా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు విప్‌ను ఉల్లంఘించి బీజేపీ అభ్యర్థికి ఓటేశారు. దాంతో సింఘ్వీ ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఆయనను తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పింది. ఈ ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన రోజే వార్త ప్రచురించింది.

Updated Date - Aug 19 , 2024 | 07:52 AM