KCR: జీరో ఎందుకయ్యాం?
ABN, Publish Date - Jun 20 , 2024 | 03:06 AM
తాజా రాజకీయ పరిస్థితులు.. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకుగాను బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు జూలైలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
లోక్సభ ఓటమిపై జూలైలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమీక్ష
త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల సంసిద్ధతపై చర్చ
పార్టీ సంస్థాగత మార్పులపై దృష్టి పెట్టే అవకాశం
హైదరాబాద్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): తాజా రాజకీయ పరిస్థితులు.. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకుగాను బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు జూలైలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, తక్కువ సీట్లు దక్కడంతో అధికారాన్ని కోల్పోవడం.. లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలవకపోవడం వంటివి.. బీఆర్ఎ్సను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎ్సకు ఓటింగ్ శాతం కూడా పూర్తిగా పడిపోవడం ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ పార్టీ శ్రేణులతో విస్తృతస్థాయి సమావేశం చేపట్టాలని భావించడం పట్ల సొంతపార్టీ నేతల్లో చర్చ కొనసాగుతోంది.
ఎంపీ స్థాయి నేతల నుంచి గ్రామస్థాయి క్రియాశీల నాయకుల వరకు ఈ సమావేశంలో పాల్గొనేలా కారు పార్టీ కసరత్తు చేస్తోంది. ప్రధానంగా లోక్సభ ఎన్నికల ఫలితాల్లో వెనుకబాటుకు గల కారణాలను, క్షేత్రస్థాయిలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి.. మరింత బలపడేందుకు ఏం చేయాలన్న దానిపై కేసీఆర్ సమీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న సర్పంచు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వంటి స్థానిక సంస్థల ఎన్నికల కోసం సంసిద్ధత.. పార్టీ వ్యూహాలపై కూడా నేతలతో ఆయన చర్చించనున్నట్లు సమాచారం.
పార్టీ సంస్థాగత మార్పులపై దృష్టి
విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ సంస్థాగత మార్పులపై కూడా అధినేత కేసీఆర్ చర్చింనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ముందు గానీ, తర్వాత గానీ అంతర్గతంగా మార్పులు జరగొచ్చని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఓటమికి గల కారణాలను సమీక్షించుకోవడంతోపాటు.. క్షేత్రస్థాయి పరిస్థితులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ముఖ్యనేత హరీశ్రావు ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా సమీక్షలు జరిపారు. గ్రామ స్థాయి, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పార్టీకి కమిటీలు ఏర్పాటు చేయాలని, ఏళ్లతరబడి పార్టీకోసం పనిచేస్తున్న వారిని గుర్తించాలని ఆయా నియోజకవర్గాలకు చెందిన ముఖ్య కార్యకర్తలు తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో బహిరంగంగానే చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీ సంస్థాగత మార్పులపై దృష్టి సారించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
నేడు హైదరాబాద్కు కేసీఆర్..
గత కొద్దిరోజులుగా ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం హైదరాబాద్కు రానున్నారు. ఇటీవల మాజీ మంత్రి తలసాని శ్రీనివా్సయాదవ్ సోదరుడు శంకర్యాదవ్ మృతి చెందిన విషయం తెలిసిందే. నేడు శంకర్యాదవ్ దశదిన కర్మ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో తలసాని కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. ఆ తర్వాత నందినగర్లోని తన నివాసానికి చేరుకుని పార్టీ నేతలను కలవనున్నారు.
కాంగ్రెస్ పాలనలో
భద్రత ప్రశ్నార్థకం:హరీశ్
హైదరాబాద్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని.. వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాత్మక ఘటనలే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. గత పదేళ్ళలో శాంతిభద్రతలకు చిరునామాగా మారిన తెలంగాణలో, కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఆరునెలల్లో భద్రత ప్రశ్నార్థకంగా మారడం బాధాకరమని బుధవారం ట్విటర్లో ఆయన పేర్కొన్నారు. గడిచిన వారంరోజుల్లో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగా సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారని, ఇదే విధంగా హైదరాబాద్ నడిబొడ్డున బాలాపూర్లో సమీర్ అనే యువకుడిని దారుణంగా పొడిచి చంపారన్నారు. రక్షించాల్సిన పోలీసే, తోటి మహిళా కానిేస్టబుల్పై భూపాలపల్లి జిల్లాలో లైంగికదాడికి పాల్పడ్డాడని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కళ్లు తెరిచి ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలు కాపాడాలని కోరారు.
Updated Date - Jun 20 , 2024 | 03:07 AM