ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana: వరద బాధితులకు విరాళంగా 100 కోట్లు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు

ABN, Publish Date - Sep 03 , 2024 | 11:19 AM

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఉదారత చాటుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఇది చూసి చలించిపోయిన ఉద్యోగులు పెద్ద మనసు చాటుకున్నారు..

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఉదారత చాటుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. తినడానికి తిండి లేక.. తాగడానికి నీళ్లు లేక పలు ప్రాంతాల ప్రజలు వరదలో చిక్కకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇది చూసి చలించిపోయిన ఉద్యోగులు పెద్ద మనసు చాటుకున్నారు. వరద బాధితుల కోసం ఒకరోజు వేతనం (Basic Pay) ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ మంగళవారం ఉదయం కీలక ప్రకటన చేసింది. జేఏసీ ప్రకటించిన మొత్తం విరాళం రూ.100 కోట్లు ఉంటుంది.!


హ్యాట్సాప్..!

కాగా.. విరాళం ప్రకటించిన వారిలో ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షన్‌దారులు ఉన్నారు. వీరంతా ఒకరోజు తమ జీతంను.. సెప్టెంబర్ నెల జీతం నుంచి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి ఓ ప్రకటన రిలీజ్ చేశారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ తెలిపింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతిపెద్ద విపత్తుగా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ భావించిందని లచ్చిరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఉద్యోగుల ఉదారతకు సామాన్య ప్రజలు, వరద బాధితులు, పలు రంగాల ప్రముఖులు హ్యాట్సాప్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. వరద బాధితులకు తక్షణ సాయం కింద రూ. 10వేలు ఇవ్వాల్సిందిగా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చిట్‌ చాట్‌లో భాగంగా ఈ ప్రకటన చేశారు.


దేవుడిని ప్రార్థిస్తున్నా..!

ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు ఎంతో మంది సామాన్య ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం తమ తమవంతుగా సాయం చేస్తున్నప్పటికీ.. సాధ్యం కాని పరిస్థితి. ఈ క్రమంలో సినీ, రాజకీయ.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తూ ‘మేము సైతం’ అంటూ ముందుకొస్తున్నారు. ఇప్పటికే వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ 25 లక్షల రూపాయిలకు ఏపీకి విరాళంగా ప్రకటించారు. ఆ తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయిలు విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకు సహాయపడాలని నా వంతుగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 లక్షల రూపాయిలు విరాళంగా ఇస్తున్నాను’ అని ట్విట్టర్‌లో ఎన్టీఆర్ ప్రకటించారు. మరోవైపు.. వరద భాదితుల సహాయార్ధం ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విశ్వక్ సేన్ రూ. 5 లక్షల విరాళంగా ప్రకటించారు.

Updated Date - Sep 03 , 2024 | 11:48 AM

Advertising
Advertising