AP Police: పోసాని అరెస్ట్

ABN, Publish Date - Feb 27 , 2025 | 03:36 AM

సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లె పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

AP Police:  పోసాని  అరెస్ట్
  • హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న ‘అన్నమయ్య’ పోలీసులు

  • జనసేన నేత ఫిర్యాదుతో పోసానిపై కేసు

  • రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై పదికిపైగా కేసులు

  • వైసీపీ అధికారంలో ఉండగా నోటి దురుసు

  • చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌పై దూషణలు

  • ప్రెస్‌మీట్‌లు, డిబేట్లలో అడ్డగోలుగా బూతులు

  • అప్పట్లో ఫిర్యాదులపై స్పందించని పోలీసులు

  • కూటమి వచ్చాక పలుచోట్ల కేసులు నమోదు

  • అరెస్టు సమయంలో పోలీసులతో వాగ్వాదం

  • నోటీసులు ఇచ్చి అరెస్టు చేసిన అధికారులు

  • నేడు రాజంపేట కోర్టులో హాజరు!

  • నాడు అడ్డగోలుగా రెచ్చిపోయి..

  • ఆనక సారీలు చెప్పుకొని..

అమరావతి/హైదరాబాద్‌/రాయచోటి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధికారంలో ఉండగా... టీడీపీ, జనసేన అగ్రనేతలపై పిచ్చిపిచ్చిగా రెచ్చిపోయి, అడ్డూ అదుపూ లేకుండా నోరు పారేసుకున్న సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లె పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని మైహోం భూజా అపార్ట్‌మెంట్‌లో ఉన్న పోసాని కృష్ణ మురళి నివాసానికి వెళ్లి... నోటీసులు అందించి, అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లె ఎస్‌ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో నలుగురు పోలీసులు హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసులను కలిసి... పోసాని కృష్ణ మురళిపై నమోదైన కేసు వివరాలను అందించారు. ఆయన అరెస్టుకు ఎస్కార్ట్‌ కల్పించాలని కోరారు. దీంతో... రాయదుర్గం ఠాణా నుంచి ఒక ఎస్‌ఐ, ఒక కానిస్టేబుల్‌ ఏపీ పోలీసులకు తోడుగా వెళ్లారు. రాత్రి 8.45 గంటల సమయంలో మైహోం భూజాలోని పోసాని నివాసానికి వెళ్లి, ఆయనను అరెస్టు చేశారు. ఆయనను గురువారం రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశముంది.

పోలీసులతో వాగ్వాదం...

అరెస్టు సమయంలో పోసాని పోలీసులకు సహకరించకుండా వాగ్వాదానికి దిగారు. ‘నోటీసులు తీసుకోను. అరెస్టు చేసుకోండి. ఆడవాళ్ల మీద రౌడీయిజం చేస్తారా?’ అంటూ నోరు పారేసుకున్నారు. ‘మీరెవరు? ఎలా మా ఇంటికి వస్తారు?’ అని ప్రశ్నించడంతో... తాము అన్నమయ్య జిల్లా పోలీసులమని ఎస్‌ఐ భక్తవత్సలం తెలిపారు. అరెస్టు చేస్తున్నాం... సహకరించండి అని కోరారు. ‘‘ముందు నాకు నోటీసు ఇవ్వండి. నేను ఆస్పత్రికి వెళ్లి ట్రీట్‌మెంట్‌ చేయించుకుని... తర్వాత మీ దగ్గరికి వస్తాను’’ అని పోలీసులకు సూచించారు. అలా కుదరదని, అరెస్టుకు సహకరించకపోతే తమ డ్యూటీ తాము చేయాల్సి వస్తుందని పోలీసులు స్పష్టం చేశారు. ‘మా ఇంట్లోకి వచ్చి నన్నే కోఆపరేట్‌ చేయమంటారేంటి’ అని పోసాని వారిని నిలదీశారు. కేసు నమోదైతే కశ్మీర్‌కైనా వెళ్లి అరెస్టు చేసే అధికారం ఉంటుందని సదరు అధికారి స్పష్టం చేశారు. ‘నాకు ఆరోగ్యం బాగలేదు... ఆపరేషన్‌ చేయించుకున్నా. పేషంట్‌ను కూడా పట్టించుకోరా’ అని మళ్లీ పోసాని ఆగ్రహించారు. పోసాని సతీమణికి నోటీసు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. ‘సర్‌ను అరెస్టు చేస్తున్నాం, నోటీసు తీసుకోండి మేడమ్‌’ అని కోరడంతో... ‘తీసుకోవద్దు... తీసుకోవద్దు’ అని పోసాని ఆమెను ఆదేశించారు. ‘నోటీసు తీసుకోండి సార్‌’ అని పోలీసు అధికారి పదేపదే కోరినా... ‘నోటీసు తీసుకునేదిలేదు. అరెస్టు చేసుకోండి’ అని విసురుగా బదులిచ్చారు. ‘ఆడవాళ్ల మీద రౌడీయిజం చేయొద్దు’ అని పోలీసులను హెచ్చరించారు. ‘మేం రౌడీయిజం చేయడంలేదు. నోటీసు ఇస్తున్నాం’ అని ఎస్‌ఐ బదులిచ్చారు. ‘నేను మాత్రలు వేసుకోవాలి. అన్నం తింటా’ అన్నారు. ఆయన వేసుకోవాల్సిన మందులు ఇవ్వాలని పోలీసులు సూచించగా... ‘ఏ మాత్ర ఎప్పుడు వేసుకోవాలో ఆయనకు తెలియదు. అన్నీ నేనే ఇస్తా’ అని ఆయన సతీమణి చెప్పారు. అన్ని విషయాలు తాము దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఆయన కొంత సమయం తీసుకుని దుస్తులు మార్చుకుని, పోలీసులతో వచ్చారు.

సారీలు చెప్పుకొని...

కూటమి అధికారంలోకి వచ్చాక కూడా పోసాని తన తీరు మార్చుకోలేదు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌నాయుడుపై వ్యక్తిగత దూషణలు, అడ్డగోలు ఆరోపణలు చేశారు. దీనిపై అనంతపురం రూరల్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ తర్వాత వరుస కేసులు, అరెస్టుల భయంతో పోసాని ఒక్కసారిగా తన స్వరం మార్చేశారు. అంతకుముందు వాడూ, వీడు అని విరుచుకుపడిన ఆయనే... ‘గారు’ అంటూ మర్యాద ఇచ్చారు. ‘నేను రాజకీయాల నుంచి తప్పుకొంటున్నా. ఇక ఎవరి గురించీ మాట్లాడను’ అని చేతులు పైకెత్తేశారు. ‘రాజకీయ నాయకులందరికీ నమస్కరిస్తున్నాను. ఇన్నేళ్లు నన్ను ఆదరించారు. ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డలు, నా కుటుంబం కోసమే బతుకుతా. ఏ రాజకీయాల గురించీ మాట్లాడను’ అని వినమ్రంగా తెలిపారు. కానీ... అప్పటికే ఆయనపై రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. సీఐడీకి కూడా ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపింది.

రంగంలోకి అన్నమయ్య జిల్లా పోలీసులు

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె పోలీ్‌సస్టేషన్‌లో ఈనెల 24వ తేదీ మణి అనే జనసేన నాయకుడు పోసానిపై ఫిర్యాదు చేశారు. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించడం వంటి అభియోగాలతో భారత న్యాయ సంహితలోని సెక్షన్‌ 196, 353 (2), 111 రెడ్‌విత్‌ 3(5) కింద కేసు (క్రైమ్‌ నంబర్‌ 65/2025) నమోదు చేశారు. పోసాని మాట్లాడిన మాటల వీడియో, ఆడియో టేపులను పోలీసులు పరిశీలించారు. ఇదే కేసులో ఆయనను అరెస్టు చేశారు.

నాడు అడ్డగోలుగా రెచ్చిపోయి

2019లో వైసీపీ అధికారంలోకి రాకముందు నుంచే పోసాని టీడీపీ, జనసేన అగ్రనేతలపై అడ్డగోలుగా మాట్లాడటం మొదలుపెట్టారు. ‘నేను ఏ పార్టీలో చేరను’ అంటూనే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లపై శ్రుతిమించి వ్యక్తిగత విమర్శలకు దిగేవారు. ఇక... వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన మరింత రెచ్చిపోయారు. జగన్‌పట్ల స్వామి భక్తిని చాటుకుంటూ... చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లను బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. దీనికి ప్రతిఫలంగా జగన్‌ ఆయనకు ఏపీ ఫిల్మ్‌డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎ్‌ఫడీసీ) చైర్మన్‌ పదవి కట్టబెట్టారు. ప్రెస్‌మీట్లు, టీవీ డిబేట్లు, సోషల్‌ మీడియా వేదికలపై టీడీపీ, జనసేన నేతలను పోసాని అసభ్య పదజాలంతో తిట్టిన సందర్భాలు ఎన్నో! ‘‘బ్రోకర్‌, లోఫర్‌, సైకో, వెధవ, దరిద్రపు నా కొడకా, రాజకీయాలు వదిలేసి ఏ చావైనా చావు... మీ అమ్మను, భార్యను కూడా తిడతా, ఏం చేసుకుంటావో చేసుకో!’’ అంటూ ఒకసారి పవన్‌ కల్యాణ్‌పై బూతులతో విరుచుకుపడ్డారు. పత్రికల్లో ప్రచురించలేని భాష కూడా వాడారు. పోసాని వ్యాఖ్యలపై కడుపుమండిన టీడీపీ, జనసేన కార్యకర్తలు అప్పట్లో ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. కనీసం ఫిర్యాదులు కూడా తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక పోసాని వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు, విజయవాడ, నర్సారావుపేట, అన్నమయ్య, అనంతపురం, బాపట్ల, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి తదితర ప్రాంతాల్లో ఫిర్యాదులు వచ్చాయి. ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా పదికిపైగా కేసులు నమోదయ్యాయి.

Updated Date - Feb 27 , 2025 | 03:37 AM