Kakinada : ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ ప్రారంభం
ABN , Publish Date - Feb 16 , 2025 | 04:17 AM
ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ కాకినాడలో శనివారం ఘనంగా ప్రారంభమైంది.

కలెక్టరేట్ (కాకినాడ), ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ కాకినాడలో శనివారం ఘనంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి జిల్లా క్రీడా మైదానంలో క్రీడలను ప్రారంభించారు. హాకీ టోర్నమెంట్లో 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 44 జట్లు పాల్గొన్నాయి. దీనిలో పురుషుల జట్లతోపాటు మహిళల జట్లు కూడా ఉన్నాయి. శనివారం నుంచి ఈ నెల 28వతేదీ వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. తొలిరోజు మ్యాచ్-1లో హిమాచల్ సెక్టార్ టీమ్, హరియాణా సెక్టార్ టీమ్లు తలపడగా 14-0 స్కోర్తో హరియాణా టీమ్ గెలుపొందింది. మ్యాచ్-2లో కర్ణాటక సెక్టార్ టీమ్, పుదిచ్చేరి సెక్టార్ టీమ్లు తలపడగా 10-1 స్కోరుతో పుదిచ్చేరి టీమ్ గెలుపొందింది. కార్యక్రమంలో అర్జునా అవార్డు గ్రహీతలు మహ్మద్ రియాజ్, ముకేష్ కుమార్ను.. జిమ్నాస్టిక్స్ బంగారు పతకం విజేత ఎస్ఏ యాసన్ను సత్కరించారు.