ఇళ్ల మధ్య చర్చి నిర్వహణ కుదరదు
ABN , Publish Date - Apr 16 , 2025 | 01:15 AM
కత్తిమండలో కాలనీ మధ్యలో చర్చిను ఒక వ్యక్తి అక్రమంగా నిర్వహిస్తున్నారని కత్తిమండకు చెందిన పలువురు తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

మలికిపురం, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): కత్తిమండలో కాలనీ మధ్యలో చర్చిను ఒక వ్యక్తి అక్రమంగా నిర్వహిస్తున్నారని కత్తిమండకు చెందిన పలువురు తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సంవత్సర కాలం నుంచి అధికారులకు పలుమార్లు విజ్ఞప్తులు చేశామని, నిరసనలు వ్యక్తం చేశామని అయినప్పటికీ శని, ఆదివారాలు, హిందువుల పర్వదినాల్లో బయట వ్యక్తులను తీసుకువచ్చి చర్చిని నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తహశీల్దార్ పి.శ్రీనివాస్, ఎస్ఐ పి.సురేష్, ఎంపీడీవో జి.మల్లికార్జునరావు ఆందోళనకారులతో మాట్లాడారు. గతంలో చర్చి నిర్మాణానికి పంచాయతీకి ఇచ్చిన తీర్మానాన్ని రద్దు చేసినట్టు ఎంపీడీవో మల్లికార్జునరావు తెలిపారు. తహశీల్దార్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పంచాయతీ తీర్మానాన్ని, గతంలో తీసుకున్న చర్యలను జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అడబాల నరసింహారావు, ప్రయోగ నరసింహమూర్తి, ఎ.అర్జున్, కె.ఏడుకొండలు, చింతా శ్యామ్, లంకే తాతాజీ, కె.రఘులతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.