బోధనాసుపత్రుల్లో క్లినికల్ ఫోరెన్సిక్ మెడిసిన్
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:39 AM
వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో క్లినికల్ ఫోరెన్సిక్ మెడిసిన్ సేవలు ప్రారంభిం చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ డీఎస్వీఎల్ నరసింహం అన్నారు.

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ డీఎస్వీఎల్ నరసింహం
6వ రాష్ట్ర ఫోరెన్సిక్ వైద్యుల సదస్సు ప్రారంభం
కర్నూలు హాస్పిటల్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో క్లినికల్ ఫోరెన్సిక్ మెడిసిన్ సేవలు ప్రారంభిం చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ డీఎస్వీఎల్ నరసింహం అన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ న్యూలెక్చరర్ గ్యాలరీలో 6వ రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ వైద్యుల సదస్సును డీఎంఈ నరసింహం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వర్లు, ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్వోడీ ఆర్గనైజింగ్ చైర్మన్ సాయి సుఽధీర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.బ్రహ్మాజీ మాస్టర్, ఆర్గనైజింగ్ కోశాధికారి వైకేసీ రంగయ్య జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్బంగా డీఎంఈ మాట్లాడుతూ ఫోరెన్సిక్ విభాగంలో మెడికో లీగల్ డాక్యుమెంటేషన్ చాలా ముఖ్యమైందన్నారు. మిగిలిన డిపార్టుమెంటు కంటే ప్రాధాన్యం కలిగి ఉంటుం దన్నారు. క్లీనికల్ ఫోరెన్సిక్ మెడిసిన్ను ఓపీ విభాగంలో చేర్పించడానికి ప్రభుత్వానికి నివేదించామని, అనుమతి లభించిన తర్వాత సేవలు ప్రారంభిస్తామన్నారు
రియల్ హీరోలు ఫోరెన్సిక్ వైద్యులే
నేర పరిశోధనలో రియల్ హీరోలు ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యులేనని ఎస్పీ విక్రాంత్ పాటిల్ కొనియాడారు. రోడ్డు ప్రమాదాల కేసులు, వివాదాస్పద కేసుల విషయంలో వైద్యుల రిపోర్టుతోనే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. క్రైం కేసుల్లో పోలీసులు నిందితులను గుర్తించి అరెస్టు చేస్తున్నారని, బయటి సమాజానికి ఇది మాత్రమే కనిపిస్తుందని, తెర వెనుక మాత్రం ఫోరెన్సిక్ వైద్యులే ఉన్నారన్నారు. చాలా కేసుల్లో డాక్టర్ల పోస్టుమార్టం నివేదికల ఆధారంగా సాక్ష్యాలు లభిస్తాయని, అందుకే పోలీసులు ఫోరెన్సిక్ వైద్యుల మద్య బంధం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సీఎస్ కృష్ణప్రకాష్, రిటైర్డు ఫోరెన్సిక్ ప్రొఫెసర్ వీర నాగిరెడ్డి, ఏపీఏఎఫ్ఎంటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, వివిధ రాష్ట్రాల నుంచి వైద్యులు పాల్గొన్నారు.