అర్హులందరికీ భూముల పంపిణీకి చర్యలు
ABN , Publish Date - Apr 07 , 2025 | 11:22 PM
ఏకలవ్యనగర్ ఎస్టీలు సాగు చేసుకుంటున్న భూములను పరిశీలించి నిబంధనల మేరకు పట్టాలు పంపిణీకి చర్యలు చేపడతామని ఒంగోలు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎస్టీలకు భూములు పంపిణీ చేయలేదంటూ హైకోర్టును ఆశ్రయించి కోర్టుదిక్కరణ కేసు వేసిన రాష్ట్ర ట్రైబల్ రైట్స్ ఫోరమ్ చైర్మన్ ఇట్టా బాబురావుతో సోమవారం ఆమె మాట్లాడారు.

తాళ్లూరు, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): ఏకలవ్యనగర్ ఎస్టీలు సాగు చేసుకుంటున్న భూములను పరిశీలించి నిబంధనల మేరకు పట్టాలు పంపిణీకి చర్యలు చేపడతామని ఒంగోలు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎస్టీలకు భూములు పంపిణీ చేయలేదంటూ హైకోర్టును ఆశ్రయించి కోర్టుదిక్కరణ కేసు వేసిన రాష్ట్ర ట్రైబల్ రైట్స్ ఫోరమ్ చైర్మన్ ఇట్టా బాబురావుతో సోమవారం ఆమె మాట్లాడారు. సోమవర్పాడు సర్వే నంబర్ 370 నుండి 405 వరకు గల ప్రభుత్వ భూముల్లో దశాబ్దాల కాలంగా ఎస్టీలు సాగుచేసుకుంటున్నారని బాబురావు పేర్కొన్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు పంపిణీ చేయాలని అనేకమార్లు అధికారులకు, ప్రభుత్వాలకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. గత్యంతరం లేక హైకోర్టును ఆశ్రయించగా ఎస్టీలకు న్యాయం చేయమని ఆదేశించినా పట్టించుకోలేదన్నారు. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయనందునే అధికారులు, ప్రభుత్వంపై కోర్టు దిక్కరణ కేసు నమోదు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఆర్డీవో లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వుల మేరకు క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించి, అర్హత గల ఎస్టీలందరికి పంపిణీకి చర్యలు చేపడతామన్నారు. అనంతరం ఆర్డీవో ఏకల్వనగర్ను సందర్శించి ఎస్టీలతో మాట్డాడారు. కార్యక్రమంలో తహసీల్దార్ కె.సంజీవరావు, డిప్యూటీ తహసీల్దార్ ఇమ్మానియోల్ రాజు, సర్వేయర్, వీఆర్వోలు పాల్గొన్నారు.