ముగిసిన వసంత నవరాత్రులు
ABN , Publish Date - Apr 08 , 2025 | 01:08 AM
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వరస్వామి, బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవార్ల ఆలయాల్లో నిర్వహిస్తున్న ఉగాది వసంత నవరాత్రులు సోమవారం ముగిశాయి.

త్రిపురాంతకం, ఏప్రిల్ 7 ( ఆంధ్రజ్యోతి ) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వరస్వామి, బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవార్ల ఆలయాల్లో నిర్వహిస్తున్న ఉగాది వసంత నవరాత్రులు సోమవారం ముగిశాయి. గత నెల 30వ తేదీ నుంచి నవరాత్రులు నిర్వహిస్తుండగా సోమవారం గణపతిపూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాసన, మండపారాధన, గోపూజ, సప్తశతి పారాయణం, కలశపూజ, ఉత్సవమూర్తులకు అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు నాగఫణిశాస్త్రి, ఫణీంద్రకుమార్శర్మ, ఆలయాల ప్రధా న అర్చకులు ప్రసాదశర్మ, విశ్వన్నారాయణశాస్త్రి ఆధ్వర్యంలో బలిహరణ పూజలు, వసంతోత్సవం, సంప్రోక్షణ అనంత రం పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా బాలాత్రిపుర సుందరీదేవి సేవాసమితి మహిళలు అమ్మవారికి సారె సమర్పించారు. కార్యక్రమం లో ఈవో డి.రజనీకుమారి, సి బ్బంది, భక్తులు పాల్గొన్నారు.
కొనకనమిట్ల : మండలంలోని చినమనగుండం, గొట్లగట్టు గ్రామాలలో రెండవరోజు సోమవారం శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్బంగా రామాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉదయం నుండి భక్తులు దేవాలయానికి వెళ్లి సీతాసమేత పట్టాభిరామస్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం అన్నదానం చేశారు. రాత్రికి సీతాసమేతరామస్వామిని వేదపండితులు ప్రత్యేకంగా అలంకరిచారు. పల్లకిలో అశీనులైన పట్టాభిరామస్వామి కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. అత్యంత భక్తిశ్రద్ధలతో భక్తులు పల్లకిలో మంగళవాయిద్యాల నడుమ గ్రామంలోని వీధులలో స్వామివారిని ఊరేగించారు. అదేవిధంగా గొట్లగట్టు గ్రామంలో రెండవరోజు స్వామివారిని హనుమంత వాహనంపై పురవీధుల్లో ఊరేగించారు.
గిద్దలూరు : పట్టణంలోని పాతబద్వేల్ రోడ్డులోని సీతారామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి నవరాత్రులు వైభవంగా ముగిశాయి. చివరిరోజు సోమవారం దేవస్థానంలో ముగింపు పూజలు నిర్వహిం చారు. మధ్యాహ్నం భక్తులందరికీ అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం సీతారామస్వామి వారి గ్రామోత్సవం కనుల పండువగా మహిళలు, చిన్నారుల కోలాట ప్రదర్శనల నడుమ గ్రామోత్సవాన్ని దేవస్థాన కమిటీ ప్రతినిధులు ఘనంగా నిర్వహించారు.