పెనుగాలుల బీభత్సం
ABN , Publish Date - Apr 14 , 2025 | 01:02 AM
మండలంలోని వేమలపేట, వేములకోట చింత గుంట్ల, తిప్పాయపాలెం, గజ్జలకొండలతో పాటు మరికొన్ని గ్రామాలలో ఆదివారం సాయత్రం వీచిన పెనుగాలులకు 20 స్తంభాలు నెలకొరిగాయి.

మార్కాపురం రూరల్, ఏప్రిల్13 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని వేమలపేట, వేములకోట చింత గుంట్ల, తిప్పాయపాలెం, గజ్జలకొండలతో పాటు మరికొన్ని గ్రామాలలో ఆదివారం సాయత్రం వీచిన పెనుగాలులకు 20 స్తంభాలు నెలకొరిగాయి. అంతే కాకుండా మండలంలోని వేమలకోట వద్ద మార్కా పురం- కంభం రహదారిలో చెట్టు కొమ్మ విరిగి రోడ్డుపై అడ్డంగా పడింది. దీంతో వాహనాల రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంభాలు పడిపోవ డంతో ఆయా గ్రామలలో కొంత సమయం పాటు విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. ఆయా గ్రామాలలో రైతులకు పంటపొలాలకు విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. గజ్జలకొండ గ్రామ పరిధి లో రైతులు ఏర్పాటు చేసుకున్న పొగాకు పాకలు గాలికి లేచి పోయాయి. బొప్పాయి పంట నేలకు వాలి పోయింది.
త్రుటిలో తప్పిన ప్రమాదం
పొదిలి : మండలంలో ఆదివారం బలమైన గాలులతో పాటు తేలికపాటి వర్షం కురిసింది. దీంతో దర్శి పొదిలి ప్రధాన రహదారి వెంబడి ఉన్న చెట్లు ఉన్నగురవాయపాలెం గ్రామం వద్ద్ద చెట్లు, విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. విద్యుత్స్తంభం విరిగి చెట్టుకింద నిలిపి ఉంచిన ట్రాక్టర్పై పడింది. గ్రామంలో రోడ్డు కూడలిలో ఉన్న వేపచెట్టు బలమైన గాలులకు కూకటివేళ్ళతోసహా విరిగిపడినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అంతే కాకుండా దర్శివైపు వెళుతున్న కారుపై చెట్టు విరిగిపడింది. అయితే కారులో డ్రైవర్ ఒక్కడే ఉండడం కారుకు వెనుకవైపు చెట్టు పడటంతో పెద్దప్రమాదమే తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ఇంతటి బలమైన గాలులు ఎప్పుడు చూడలేదని గ్రామస్థులు పేర్కొంటున్నారు. కుంచేపల్లి, ఉన్నగురువాయపాలెం గ్రామాల్లో ఇళ్లముందు ఉన్న చెట్లు కూడా పడిపోయాయాని తెలిపారు. మబ్బుపట్టి వర్షం వస్తుందంటే వర్షం కంటే ముందు గాలులకు భయపడాల్సిన పరిస్థితి ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.