Supreme Court: పభావతి బెయుల్ పిటిషన్ విచారణ 24కు వాయిదా
ABN , Publish Date - Apr 16 , 2025 | 03:30 AM
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణను ఏప్రిల్ 24కి వాయిదా వేసింది

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్, డాక్టర్ నీలం ప్రభావతి దాఖలుచేసిన బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీం కోర్టు మరోసారి వాయిదా వేసింది. గత వైసీపీ హయాంలో అప్పటి ఎంపీగా ఉన్న తనను సీఐడీ కస్టడీలో తీవ్రంగా వేధించారంటూ గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో రఘురామ ఫిర్యాదు చేశారు. ఆ కేసులో జీజీహెచ్ అప్పటి సూపరింటెండెంట్ ప్రభావతి ఏ 5గా ఉన్నారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించగా నిరాశ ఎదురైంది. హైకోర్టు తీర్పును ప్రభావతి జనవరి 22న సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్ మంగళవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా అందుబాటులో లేరని, కేసు విచారణను ఈ నెల 21 లేదా 24కు వాయిదా వేయాలని మరో న్యాయవాది కోరారు. ఆ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.