Nominated Positions: నాయకుల్లో నైరాశ్యం నిజమే
ABN , Publish Date - Apr 09 , 2025 | 05:48 AM
టీడీపీ నాయకుల్లో నైరాశ్యం ఉందని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. కష్టపడినవారికి సముచిత స్థానం కల్పించేందుకు నాయకత్వం కృషి చేస్తోంది

కష్టపడినవారికి సముచిత స్థానం: పల్లా
తిరుపతి, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): ‘నామినేటెడ్ పదవులు ఆశించిన నాయకుల్లో నైరాశ్యం ఉంది. ఎవరు కాదన్నా ఔనన్నా ఇది చర్చించుకోవాల్సిన అంశమే’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. పార్టీ కోసం కష్టపడినవారికి సముచిత స్థానం కల్పించేందుకు నాయకత్వం కృషిచేస్తోందని చెప్పారు. తిరుపతిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీలోని సీనియర్లు, సామాజికవర్గాలు, కూటమి పార్టీల వాటాలు.. ఇలా అనేక సమీకరణలతో పదవుల భర్తీ ఆలస్యమవుతోందన్నారు. కొన్ని పదవులు రాష్ట్రం యూనిట్గా, మరికొన్ని జిల్లా యూనిట్గా తీసుకుని ఇవ్వాల్సి ఉంటుందని.. త్వరలోనే అన్ని నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని తెలిపారు. తిరుమల కొండపై గతంలో ఇష్టారాజ్యంగా చేయడం వల్లే వైసీపీని 11 సీట్లకే దేవుడు పరిమితం చేశాడని.. ఇంకా కొందరు మిడిసిపడుతున్నారని, వారిపైనా చర్యలు ఉంటాయన్నారు. ముస్లిం సోదరులకు అండగా ఉండాలనే వక్ఫ్ బిల్లుకు పార్లమెంటులో మద్దతు పలికామన్నారు. రెండు నాల్కలతో వ్యవహరించిన వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.