సఖ్యతగా లేకుంటే నష్టపోతాం
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:28 AM
టీడీపీ అరకు అసెంబ్లీ నియోజకవర్గ నేతలు దొన్నుదొర, కిడారి శ్రావణ్కుమార్లు సమన్వయంతో పని చేయకపోవడంతో వర్గపోరు ఎక్కువైపోతోందని, దీని వల్ల పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆ పార్టీ నాయకుడు, పెదలబుడు సర్పంచ్ పెట్టెలి దాసుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో మంగళవారం అరకు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ సంస్థాగత సమావేశాన్ని నియోజకవర్గ ఇన్చార్జి దొన్నుదొర అధ్యక్షతన నిర్వహించారు.

- అధిష్ఠానం అందలమెక్కించినా వేరుకుంపట్లు ఎందుకు?
- పార్టీ నాయకులు, కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకురాకుండా వర్గపోరు ఏమిటి?
- టీడీపీ నేతలు దొన్నుదొర, కిడారి శ్రావణ్కుమార్ను ఉద్దేశించి పెదలబుడు సర్పంచ్ దాసుబాబు ఘాటు వ్యాఖ్యలు
అరకులోయ, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): టీడీపీ అరకు అసెంబ్లీ నియోజకవర్గ నేతలు దొన్నుదొర, కిడారి శ్రావణ్కుమార్లు సమన్వయంతో పని చేయకపోవడంతో వర్గపోరు ఎక్కువైపోతోందని, దీని వల్ల పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆ పార్టీ నాయకుడు, పెదలబుడు సర్పంచ్ పెట్టెలి దాసుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో మంగళవారం అరకు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ సంస్థాగత సమావేశాన్ని నియోజకవర్గ ఇన్చార్జి దొన్నుదొర అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా దాసుబాబు మాట్లాడుతూ గత ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో భాగంగా అరకు సీటును బీజేపీకి కేటాయించినా, అధికారంలోకి వచ్చాక అధిష్ఠానం దొన్నుదొర, కిడారి శ్రావణ్కుమార్లకు చైర్మన్ పదవులు ఇచ్చి గౌరవించిందన్నారు. ఆ ఇద్దరూ పార్టీ పటిష్ఠతకు కృషి చేయాల్సిందిపోయి, ఇంకా వర్గాలుగా వ్యవహరించడం ఏమిటని నిలదీశారు. ఇలాగే ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా విజయం సాధిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి కిడారి శ్రావణ్కుమార్ రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఇప్పటికైనా ఇద్దరు నేతలు కలిసి పనిచేసి నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాలని కోరారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా విజయం సాధించాలో పార్టీ శ్రేణులకు దొన్నుదొర దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఆరు మండలాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.