టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు స్వాధీనం చేయండి
ABN , Publish Date - Mar 18 , 2025 | 12:48 AM
జిల్లాలో ఇళ్ల సమస్యలను తక్షణం పరిష్కరించపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హెచ్చరించారు.

కలెక్టరేట్ వద్ద సీపీఎం మహా ధర్నా
భీమవరం అర్బన్, మార్చి17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇళ్ల సమస్యలను తక్షణం పరిష్కరించపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హెచ్చరించారు. మార్చి 8 నుంచి 16 వరకు సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా సోమవారం భీమవరంలోని కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేపట్టారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు తక్షణం స్వాధీనం చేయాలని నిన దించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి.వాసుదేవరావు అధ్యక్షతన జరిగిన సభలో శ్రీ నివాసరావు మాట్లాడుతూ జిల్లాలో 20వేల పైగా టిడ్కో ఇళ్లు ఉన్నాయని, ఎక్కడా కనీస సౌకర్యాలు లేవని మండిపడ్డారు. ప్రజల డబ్బుతో కట్టించి ప్రజలకు స్వాధీనం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్వాఽధీనం చేయకపోతే తామే పేదలను తీసుకెళ్లి స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందన్నారు. జిల్లా కార్యదర్శి జెఎన్వీ గోపాలన్ మాట్లాడుతూ జిల్లా లో ప్రభుత్వ కాలనీలు ప్రతిపక్ష కాలనీలుగా మారుతున్నాయన్నారు. టిడ్కో ఇళ్లను ఒక ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడున్న కాలనీలను ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. అనంతరం డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, జిల్లా హౌసింగ్ డీఈ ఈ.రమణకు వినతిపత్రం అం దించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బలరాం, చింతకాయల బాబురావు, కౌరు పెద్దిరాజు, కర్రి నాగేశ్వరరావు, పీవీ.ప్రతాప్, దూసి కళ్యాణి, క్రాంతిబాబు, మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్, కె.రాజారామ్మోహన్రాయ్, జుత్తిగ నర్సింహముర్తి, బాలం విజయకుమార్, బొక్కా సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.