బ్రోకరేజీ కింగ్ నిఖిల్ కామత్
ABN , Publish Date - Mar 31 , 2025 | 05:48 AM
నిఖిల్ కామత్.. ఇప్పుడు దేశ స్టాక్ మార్కెట్లో ఈ పేరు తెలియని ఇన్వెస్టర్ ఉండరంటే అతిశయోక్తి కాదు. జీరో బ్రోకరేజీ నినాదంతో స్టాక్ మార్కెట్ బ్రోకరేజీ చరిత్రను తిరగరాసిన జీరోధా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ గురించి చాలా కొద్దిమందికే..

దేశంలో యంగెస్ట్ బిలియనీర్
రూ.22,300 కోట్ల నికర ఆస్తులు
నిఖిల్ కామత్.. ఇప్పుడు దేశ స్టాక్ మార్కెట్లో ఈ పేరు తెలియని ఇన్వెస్టర్ ఉండరంటే అతిశయోక్తి కాదు. జీరో బ్రోకరేజీ నినాదంతో స్టాక్ మార్కెట్ బ్రోకరేజీ చరిత్రను తిరగరాసిన జీరోధా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ గురించి చాలా కొద్దిమందికే తెలుసు. కాలేజీ చదువు కూడా లేకుండా హేమాహేమీ స్టాక్ బ్రోకరేజీ సంస్థలకే చెమటలు పట్టించి 38 ఏళ్లకే 260 కోట్ల డాలర్ల (సుమారు రూ.22,300 కోట్లు) ఆస్తులతో దేశంలో యంగెస్ట్ బిలియనీర్గా నిలిచిన కామత్.. జీవితంలో ఎదగాలనుకునే ఎంతో మంది ఔత్సాహికులకు ప్రేరణ.
జీవితం-చదువు: నిఖిల్ కామత్ కర్ణాటకలోని ఉడుపిలో 1986 సెప్టెంబరు 5న జన్మించారు. తండ్రి బ్యాంకర్. తల్లి టీచర్. వారు నిఖిల్ను బాగా చదివించాలనుకున్నారు. అయితే మనోడికి చదువు పెద్దగా అబ్బలేదు. స్కూల్లో ఉండగానే 14 ఏళ్ల వయసులోనే మొబైల్ ఫోన్లు అమ్మి నాలుగు రాళ్లు సంపాదించడం ప్రారంభించాడు. తల్లిదండ్రులకు ఇది ఏ మాత్రం నచ్చలేదు. ముందు టెన్త్ క్లాసైనా పూర్తి చేయ్. తర్వాత నీ ఏడుపు నువ్వు ఏడుద్దువు గాని అని మందలించారు. అయినా మనోడు వింటేగా. దాంతో కామత్ తల్లి కొన్నిసార్లు అతడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు లాక్కుని టాయిలెట్లో పడేసేవారు. అయినా మనోడిలో ఏ మార్పు లేదు. ఫోన్లు కాకపోతే ఇంకో బిజినెస్ అనుకుని వేరే చిన్న చిన్న వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించడం ప్రారంభించారు.
ఉద్యోగం: అమ్మా నాన్న పోరు ప
డలేక నిఖిల్ కామత్ నెలకు రూ.8,000 జీతంతో ఒక కాల్ సెంటర్ జాబ్లో చేరారు. అక్కడే నిఖిల్కు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అలవాటైంది. మనోడికి ఉన్న మార్కెట్ విశ్లేషణా శక్తికి తోడు కాలం కూడా కలిసి రావడంతో ఈ ట్రేడింగ్లో బాగానే సంపాదించాడు.
జీరోధా స్థాపన: కాల్ సెంటర్ జాబ్ చేస్తూ, ట్రేడింగ్లో సంపాదించిన డబ్బుతో సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాడు. అందుకు అన్న నితిన్ కామత్ కూడా తోడయ్యాడు. ఏ బిజినెస్ ప్రారంభిద్దామా? అని ఆలోచిస్తుంటే స్టాక్ మార్కెట్ బ్రోకరేజీ బిజినెస్ ఆలోచన వచ్చింది. అప్పట్లో షేర్లు అమ్మాలన్నా, కొనాలన్నా బ్రోకరేజీ కమిషన్ ఎక్కువగా ఉండేది. దాంతో చిన్న మదుపరులు ఎవరూ పెద్దగా స్టాక్ మార్కెట్కు వచ్చేవారు కాదు. దీన్నే వ్యాపార అవకాశంగా మార్చుకోవాలని అన్నదమ్ములిద్దరూ నిర్ణయించారు. ఇద్దరు కలిసి 2010లో జీరోధా పేరుతో స్టాక్ బ్రోకరేజీ సంస్థను ఏర్పాటు చేశారు. ఇంట్రాడే, డెరివేటివ్స్ ట్రేడింగ్పై నిర్ణీత చార్జీలు, డెలివరీ ఆధారిత అమ్మకాలు, కొనుగోళ్లపై నో బ్రోకరేజీ అనే వీరి నినాదం బాగానే పేలింది. ఒక విధంగా చెప్పాలంటే జియో ద్వారా రిలయన్స్ భారత టెలికాం రంగంలో ఎలాంటి సునామీ సృష్టించిందో.. జీరోధా కూడా భారత స్టాక్ బ్రోకింగ్ వ్యాపారంలో అలాంటి మార్పునే సృష్టించింది. అధునాతన టెక్నాలజీ కూడా ఇందుకు తోడవడంతో స్టాక్ బ్రోకింగ్ వ్యాపారంలో జీరోధాకు ఎదురు లేకుండా పోయింది. ప్రస్తుతం దాదాపు కోటి మంది మదుపరులు ఈ యాప్ ద్వారా తమ స్టాక్ మార్కెట్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. దీన్నిబట్టి కామత్ సోదరులు ఈ యాప్ను ఎంతగా మదుపరులకు దగ్గర చేశారో అర్థం చేసుకోవచ్చు.
చిన్న వయసులోనే బిలియనీర్: ఫోర్బ్స్ పత్రిక నివేదిక ప్రకారం నిఖిల్ కామత్ ఆస్తుల ప్రస్తుత విలువ 260 కోట్ల డాలర్లు. ప్రస్తుతం మారకం రేటు ప్రకారం ఇది సుమారు రూ.22,300 కోట్లకు సమానం. దేశంలో అత్యంత చిన్న వయసులో బిలియనీర్గా ఎదిగింది ఎవరంటే నిఖిల్ కామతే. పట్టుదల, ముందు చూపు, వినూత్న ఆలోచనలే తనను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టాయని నిఖిల్ కామత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నాలుగు పదుల వయసు నిండకుండానే ఇంతగా ఎదిగిన ఈ బిలియనీర్కు సామాజిక స్పృహా ఎక్కువే. తన ఆస్తుల్లో సగాన్ని సామాజిక సంక్షేమ పథకాలకు ఇచ్చేస్తానని 2023 జూన్లో ప్రకటించారు. మంచి వ్యాపార ఆలోచన, టెక్నాలజీ ఉంటే విజయం దానంతట అదే వస్తుందనుకునే ఎందరో ఔత్సాహికలకు నితిన్ కామత్ చక్కటి ఉదాహరణ.
పుస్తకాలు చదివితే ఏమొస్తుంది గురూ. మహా అయితే కొద్దో గొప్పో శాస్త్ర జ్ఞానం వస్తుంది. దాంతో ఏదో కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ జీవితం గడిపేయవచ్చు. అదే లోకాన్ని చదివితే లోకజ్ఞానం, ఇంకా కాలం కలిసొస్తే కోట్లకు పడగలెత్తడం ఎలాగో కూడా తెలుసుకోవచ్చు. భారత స్టాక్ మార్కెట్లో బ్రోకరేజీ బిజినె్సను సమూలంగా మార్చేసిన నిఖిల్ కామత్ ఇందుకు ఉదాహరణ. జీరో బ్రోకరేజీ సంస్థ ‘జీరోధా’ ఏర్పాటు చేసి దేశ స్టాక్ బ్రోకరేజీ చరిత్రను తిరగ రాసిన నిఖిల్ కామత్ గురించి మరిన్ని విశేషాలు.
ఇవి కూడా చదవండి:
Financial Planning: ప్రభుత్వ స్కీంలో కోటి రూపాయలు సంపాదించడం ఎలా..నెలకు ఎంత సేవ్ చేయాలి..
Upcoming IPOs: ఇన్వెస్టర్లకు అలర్ట్..వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే..
Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..
Railway Jobs: రైల్వేలో 9,970 పోస్టులకు నోటిఫికేషన్..అప్లై చేశారా లేదా..
Single Recharge: ఒకే రీఛార్జ్తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్ఎన్ఎల్
Read More Business News and Latest Telugu News