Share News

Dowry Harassment: ఎంత దారుణం.. మహిళను వివస్త్రను చేసి ఆపై

ABN , Publish Date - Apr 10 , 2025 | 02:43 PM

Dowry Harassment: నెల్లూరులో జరిగిన దారుణ ఘటనను చూస్తే ఆడపిల్లలు పెళ్లి అంటే భయపడిపోయే పరిస్థితి వస్తుందేమో. ఆ మహిళపట్ల అత్తింటి వారు ప్రవర్తించిన తీరు చూస్తే కన్నీరుపెట్టకుండా ఉండలేరు.

 Dowry Harassment: ఎంత దారుణం.. మహిళను వివస్త్రను చేసి ఆపై
Dowry Harassment Case

నెల్లూరు, ఏప్రిల్ 10: పెళ్లై నాలుగు సంవత్సరాలు గడిచినా ఆ మహిళకు వేధింపులు తగ్గలేదు. భర్తే కాదు అత్తామామ, ఆడపడుచు కూడా ఆమెకు నరకం చూపించారు. ఎప్పటికైనా మారకపోతా అని ఆ వివాహిత ఎదురుచూసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఆమె పట్ల అత్తంటి వారు చేసిన అఘాయిత్యం చూస్తే ప్రతీ ఒక్కరి గుండె బరువెక్కుతుంది. ఈ ఘటనను చూసి సాటి ఆడపిల్లలు మాత్రం పెళ్లంటేనే భయపడకుండా ఉండలేరేమో. ఇంతకీ మహిళను అత్తంటి వారు ఏం చేశారు. ఆమె పట్ల వారు ఎలాంటి ఘోరానికి పాల్పడ్డారో ఇప్పుడు తెలుసుకుందా.


జిల్లాలో దారుణం జరిగింది. వరకట్నం కోసం మహిళను వేధించడమే కాకుండా ఆమెను అత్తంటివారు చంపేశారు. వివస్త్రను చేసి వేధించారు. విషయం బయటకు వస్తుందన్న భయంతో మహిళను దారుణంగా హత్య చేశారు. ఈవిషయం బయటకు రాకుండా ఆత్మహత్య చేసుకుందంటూ హైడ్రామా సృష్టించారు. జిల్లాలోని ఊటూరుకూరు మండలం పెద్దపుట్టపుపాళెలంలో ఈ దారుణ ఘటన జరిగింది. ఓగోలు మండలం తాడిచెట్లపాలెం గ్రామానికి చెందిన సుగుణమ్మ అనే మహిళను ఊటూరుకూరు మండలం పెద్దపుట్టపుపాళెలంకు చెందిన హరికృష్ణకు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం జరిపించారు. ఆటో నడిపిస్తూ హరీకృష్ణ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి యశస్వి అనే మూడేళ్ల చిన్నారి, హేమంత్ అనే ఏడాది కుమారుడు ఉన్నాడు. అయితే వివాహ సమయంలో సుగుణమ్మ తల్లిదండ్రులు దాదాపు 17 సవర్ల బంగారం, సంవత్సరం తర్వాత 1.60 లక్షల డబ్బును వరకట్నం కింద ఇచ్చారు. అయినా కూడా అత్తింటి వారు తరచూ సుగుణమ్మను కట్నం కోసం వేధింపులకు గురిచేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో నిన్న (బుధవారం) ఉదయం ఆమెను భర్త హరికృష్ణ, అత్తమామలు నాగూర్, నర్సమ్మ, ఆడబిడ్డ నాగలక్ష్మీ కలిసి చాలా దారుణంగా వేధించారు.

Good News for Hyderabadis: గుడ్‌న్యూస్.. హైదరాబాదీల ట్రాఫిక్‌ కష్టాలకు చెక్


ఆమెపై దాడి చేయడంతో పాటు వివస్త్రను చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతానని సుగుణమ్మ అనడంతో మరోసారి దాడి చేశారు అత్తింటివాళ్లు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె మృతిచెందిందని మృతురాలి బంధువులు చెబుతున్నారు. అయితే సుగుణమ్మ చనిపోయిన తర్వాత హత్యను ఆత్మహత్యగా చూపేందుకు ఇంటి ముందు కళ్లాపు చల్లే రంగును ముక్కులో, నోట్లో పోసి ఆత్మహత్యగా చిత్రీకరించారని బంధువులు తెలిపారు. చనిపోయిన మృతదేహాన్ని రెండు ఆస్పత్రులకు తిప్పి తమకు అప్పగించేసి వెళ్లిపోయారని మృతురాలి బంధువులు చెబుతున్నారు. ఈ హృదయవిదారకమైన ఘటనపై నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. పూర్తి స్థాయిలో వివరాలను సేకరించి సుగుణమ్మ మృతదేహాన్ని నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. జీజీహెచ్‌లో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. సుగుణమ్మ మరణంతో ఆస్పత్రి వద్ద తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. దాదాపు వివాహం జరిగి నాలుగేళ్లు అయినా, ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా వరకట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నారని, కొంత డబ్బుల ఇచ్చినప్పటికీ ఇంకా తీసుకురావాలని వేధింపులకు గురిచేశారని, చివరకు తమ బిడ్డను పొట్టనపెట్టుకున్నారంటూ సుగుణమ్మ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Kidney Stones: ఈ మొక్కతో కిడ్నీలో రాళ్లు కరిగిపోవాల్సిందే

Case against Thopudurthi: రాప్తాడు మాజీ ఎమ్మెల్యేపై కేసు ఫైల్.. కారణమిదే

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 10 , 2025 | 02:43 PM