Share News

Narendra Modi: సంఘ్‌ ఓ వటవృక్షం

ABN , Publish Date - Mar 31 , 2025 | 04:38 AM

ప్రధాని మోదీ ఆర్‌ఎస్‌ఎస్‌ను ‘భారతీయ సంస్కృతి వటవృక్షం’గా కొనియాడారు. కాంగ్రెస్ విధానాల వల్ల నక్సలిజం వ్యాప్తి చెందిందని ఆయన ఆరోపించారు

Narendra Modi: సంఘ్‌ ఓ వటవృక్షం

సేవకు ప్రతిరూపం: ప్రధాని నరేంద్ర మోదీ

నాగపూర్‌లో ఆరెస్సెస్‌ హెడ్‌క్వార్టర్స్‌ సందర్శన

హెడ్గేవార్‌, గోల్వాల్కర్లకు నివాళి

కాంగ్రెస్‌ విధానాలతోనే నక్సలిజం వ్యాప్తి!

ఛత్తీస్‌గఢ్‌లో ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో మోదీ

న్యూఢిల్లీ, మార్చి 30: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) సేవకు మరో పేరని ప్రధాని మోదీ అన్నారు. అది భారతీయ ప్రాచీన సంస్కృతికి, ఆధునికీకరణకు వటవృక్షంలాంటిదని చెప్పారు. దాని విలువలు, ఆదర్శలు జాతీయ చైతన్యాన్ని పరిరక్షిస్తున్నాయని తెలిపారు. ఆదివారం ఆయన మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ప్రథమ, ద్వితీయ సర్‌సంఘ్‌చాలక్‌లు కేబీ హెడ్గేవార్‌, ఎంఎస్‌ గోల్వాల్కర్‌ల స్మృతి మందిరాలకు వెళ్లి నివాళులు అర్పించారు. సంఘ్‌ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించిన రెండో ప్రధాని మోదీ. గతంలో వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు 2000లో వెళ్లారు. ఇద్దరూ మూడోసారి ప్రధాని అయిన తర్వాతే ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడం గమనార్హం. సంఘ్‌ ప్రాంగణంలో మాధవ్‌ నేత్రాలయ ఐ ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌కు అనుబంధంగా మాధవ్‌ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌ భవనానికి మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమర మాట్లాడుతూ.. గత వందేళ్లుగా ‘సంఘటన్‌’, ‘సమర్పణ్‌’తో ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న తపస్సు.. ‘వికసిత్‌-భారత్‌-2047’ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఇప్పుడు ఫలాలందిస్తోందని తెలిపారు.


sdfkjhbd.jpg

‘వందేళ్ల తర్వాత సంఘ్‌ మరో మైలురాయి దిశగా కదులుతోంది. స్వాతంత్య్ర పోరాటంలో 1925-47 సంక్షోభ సమయం. ఇప్పుడు 2025-47 మధ్య కాలం కూడా చాలా కీలకమైనది. భారీ లక్ష్యాలు మన ముందున్నాయి. వచ్చే వెయ్యేళ్లు శక్తిమంతమైన, పురోగామి భారత నిర్మాణానికి మనం శంకుస్థాపన చేయాలి’ అని అన్నారు. స్మృతిమందిరం వద్ద ఉన్న సందేశ పుస్తకంలో మోదీ హిందీలో సందేశం రాశారు. హెడ్గేవార్‌, గోల్వాల్కర్‌ల ఆలోచనలు తనతో పాటు ఎంతో మందికి స్ఫూర్తిని, బలాన్ని ఇచ్చాయన్నారు. ఆయన వెంట సంఘ్‌ చీఫ్‌ భాగవత్‌, కేంద్ర మంత్రిగడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌ కూడా ఉన్నారు. నాగపూర్‌లో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ బౌద్ధమతాన్ని స్వీకరించిన ‘దీక్షాభూమి’ని కూడా మోదీ సందర్శించారు. ‘దీక్షాభూమి’ సామాజిక న్యాయానికి, బడుగుల సాధికారతకు చిహ్నమన్నారు. దీక్షాభూమిలోని స్తూపం వద్దకు వెళ్లి ‘అంబేడ్కర్‌ అస్థి’ వద్ద మోదీ నివాళులు అర్పించారు.


కాంగ్రెస్‌ విధానాలతోనే నక్సలిజం వ్యాప్తి!

కాంగ్రెస్‌ దశాబ్దాల తరబడి అనుసరించిన విధానాలు నక్సలిజానికి ఊతమిచ్చాయని మోదీ అన్నారు. అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్లోనే నక్సలిజం ప్రబలంగా విస్తరించిందని తెలిపారు. ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయని.. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో శాంతిశకం ప్రారంభమైందని చెప్పారు. మోదీ ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ జిల్లా మోహభట్టాలో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. అనంతరం రూ.33,700 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అంభన్‌పూర్‌-రాయ్‌పూర్‌ మధ్య మెమూ రైలును ప్రారంభించారు. రూ.9,790 కోట్లతో ఎన్‌టీపీసీ నిర్మించే సీపత్‌ సూపర్‌ థర్మల్‌ విద్యుత్కేంద్రం మూడో దశ(800 మెగావాట్లు) కు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.15,800 కోట్లతో నిర్మించిన మొదటి సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టును ప్రారంభించారు. మరోవైపు, ఛత్తీస్‌గఢ్‌లోని బీజీపూర్‌ జిల్లాలో ఆదివారం 50 మంది నక్సలైట్లు సీఆర్‌పీఎఫ్‌, రాష్ట్ర పోలీసుల ముందు లొంగిపోయారు. వీరిలో 14మందిపై రూ.68 లక్షల మేర రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు. ప్రధాని మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.


ఇవి కూడా చదవండి:

అందాల భామతో

బ్రేకింగ్: ఘోర ప్రమాదం.. స్పాట్‌లో 6 మంది మృతి

UP: నీ ఓపికకు ఓ దండం.. 50వ ఏట 14వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

Updated Date - Mar 31 , 2025 | 04:39 AM