Siddala Kritika:సివిల్స్లో తగ్గి గ్రూప్స్లో నెగ్గి
ABN , Publish Date - Mar 31 , 2025 | 05:44 AM
సివిల్స్లో నాలుగు సార్లు విఫలమై, ఆ తర్వాత గ్రూప్స్ వైపు దృష్టి మళ్లించిన సిద్దాల కృతిక గ్రూప్-1లో 5వ ర్యాంకు సాధించింది. ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా, ఇంట్లోనే తాను సెట్ చేసిన టైమ్ టేబుల్తో సిబ్బంధం చెలామణీ చేసింది

సరూర్నగర్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ఒకటి కాదు రెండు కాదు.. ఏడేళ్లుగా పట్టు వదలకుండా పరీక్షలకు సిద్ధమవుతూ వచ్చింది. సివిల్స్లో నాలుగు సార్లు అర్హత సాధించకపోయినా నిరాశ చెందకుండా.. గ్రూప్స్ వైపు దృష్టి మళ్లించింది. గ్రూప్-4లో 511వ ర్యాంకు వచ్చినా తృప్తి చెందలేదు. పట్టుదలతో గ్రూప్-1 రాసి రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించింది. ఆమే.. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ కార్పొరేషన్లోని జిల్లెలగూడకు చెందిన మాజీ కార్పొరేటర్ సిద్దాల లావణ్య-బీరప్ప దంపతుల కుమార్తె సిద్దాల కృతిక(27). 2017లో డిగ్రీ పూర్తి చేసిన ఆమె సివిల్స్పై దృష్టి పెట్టింది. వరుసగా నాలుగు సార్లు పరీక్ష రాసినా అర్హత సాధించలేక పోయింది. అయినప్పటికీ కుంగిపోకుండా గ్రూప్స్ వైపు దృష్టి మళ్లించి 5వ ర్యాంకు దక్కించుకుంది. అటు సివిల్స్ కోసం కానీ, ఇటు గ్రూప్స్ కోసం కానీ ఆమె ఎక్కడా కోచింగ్ తీసుకోకపోవడం గమనార్హం. ఇంట్లోనే ఉండి ఏరోజుకారోజు సబ్జెక్టును ఎంచుకుని, ఎన్ని గంటలైనా దానిని పూర్తి చేసేదాకా వదిలిపెట్టేది కాదు. గ్రూప్-4 రాసిన కృతిక కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తోంది. ‘‘నేను పదో తరగతి, ఇంటర్ చదువుతున్నప్పటి నుంచే ప్రభుత్వం ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాను. నా లక్ష్యానికి మా తల్లిదండ్రులు పూర్తిగా సహకరించారు’’ అని కృతిక అన్నారు.
ఇవి కూడా చదవండి:
మరో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు..
ఏప్రిల్ 1 నుంచి రాత్రి 11.45 వరకు మెట్రో రైళ్లు..