Pocso Court: నాంపల్లి పోక్సో కోర్టు సంచలన తీర్పు.. 25 ఏళ్ల జైలు శిక్ష
ABN , Publish Date - Apr 11 , 2025 | 08:49 PM
Pocso Court: బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన ఓ వ్యక్తికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది నాంపల్లిలోని పోక్సో్ కోర్టు. అలాగే జరిమాన సైతం విధించింది. నేరం రుజువు కావడంతో ఈ శిక్షను ఖరారు చేసింది.

హైదరాబాద్, ఏప్రిల్ 11: నాంపల్లిలోని పోక్సో కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. బాలికపై అత్యాచారయత్నం కేసులో నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023లో హైదరాబాద్లోని రాజ్భవన్ మక్త ప్రాంతంలో మైనర్పై శ్రీనివాస్ అనే యువకుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. శ్రీనివాస్ అనే వ్యక్తి..బాలికను సెల్ ఫోన్ కొనిస్తానంటూ తన ఇంటికి తీసుకు వెళ్లాడు. అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక ప్రాణాలతో బయట పడిన తర్వాత.. తల్లిదండ్రులు నాంపల్లి పోలీసులను ఆశ్రయించారు.
నిందితుడు శ్రీనివాస్పై పోక్సో కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు విచారణ సమయంలో ఆధారాలు, సాక్ష్యాలు, బాలిక వాంగ్మూలాన్ని కోర్టు పరిగణలోకి తీసుకొంది. అలాగే వైద్య నివేదిక సైతం నిందితుడిపై అభియోగాలను నిజమేనని స్పష్టం చేశాయి. పోక్సో చట్టం కింద కేసు విచారించిన ప్రత్యేక కోర్టు.. నిందితుడు శ్రీనివాస్ దోషిగా తేల్చింది. దీంతో అతడికి 25 ఏళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది.
For Telangana News And Telugu News