భక్తిశ్రద్ధలతో వీరహనుమాన్ విజయయాత్ర
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:57 AM
జిల్లాకేంద్రంలో చిన్నహనుమాన్ జయంతి సందర్భంగా విశ్వహిందూపరిషత్, భజరంగదళ్ ఆధ్వర్యంలో వీరహనుమాన్ విజయయాత్ర శనివారం నిర్వహించారు. గాంధీరోడ్ రామాలయం వద్ద వీహెచ్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ రాంసింగ్ యాత్రను ప్రారంభించారు

కరీంనగర్ కల్చరల్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలో చిన్నహనుమాన్ జయంతి సందర్భంగా విశ్వహిందూపరిషత్, భజరంగదళ్ ఆధ్వర్యంలో వీరహనుమాన్ విజయయాత్ర శనివారం నిర్వహించారు. గాంధీరోడ్ రామాలయం వద్ద వీహెచ్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ రాంసింగ్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హిందూ ధర్మం కోసం ఏకీకృతం కావాలని అన్నారు. మన దేశం, సంస్కృతీ సాంప్రదాయలకోసం పాటుపడాలని పిలుపిచ్చారు. టవర్సర్కిల్, ప్రకాశం గంజ్, రూరల్ పోలీస్ స్టేషన్, కమాన్, వన్టౌన్ పోలీస్స్టేషన్, బస్టాండ్, గీతాభవన్, ఆర్అండ్బి గెస్ట్హౌజ్, కోర్ట్, మంచిర్యాల, గాంధీరోడ్ చౌరస్తాల మీదుగా ర్యాలీ తిరిగి గాంధీరోడ్ రామాలయం వద్దకు చేరుకుంది. కార్యక్రమంలో జిల్లా అఽధ్యక్ష కార్యదర్శులు ఇనుగంటి మధుసూదన్రావు, ఆదిమూలం విద్యాసాగర్, గో రక్షా రాష్ట్ర కమిటి మెంబర్ వుట్కూరి రాధాకృష్ణారెడ్డి, వీహెచ్పీ నగర అధ్యక్షుడు ఇనుగుర్తి రమేశ్, భజరంగదళ్ బాధ్యులు తోట ప్రదీప్, కన్నం శంకర్ పాల్గొన్నారు.
ఫ పటిష్ట బందోబస్తు
కరీంనగర్ క్రైం: హనుమాన్ జయంతి సందర్భంగా, వీరహనుమాన్ విజయ యాత్ర ర్యాలీకి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని పోలీస్కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. ర్యాలీ సందర్భంగా బందోబస్తు విధుల్లో పాల్గొంటున్న పోలీసు అధికారులకు సీపీ బ్రీఫింగ్ చేశారు. దాదాపు 450 మంది పోలీసు అధికారులు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో స్టాటిక్ ఫోర్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, రూప్టాప్, మొబైల్ పెట్రోలింగ్ పార్టీలను మోహరించినట్లు తెలిపారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన అన్నిచోట్ల దారి మళ్లింపు చర్యలు తీసుకున్నామన్నారు.