Share News

Kishan Reddy: బీఆర్‌ఎస్‌తో రేవంత్‌ కుమ్మక్కు

ABN , Publish Date - Feb 25 , 2025 | 05:21 AM

బీఆర్‌ఎ్‌సతో కుమ్మక్కై.. సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును నిర్వీర్యం చేశారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్‌.. కేంద్రాన్ని బద్‌నాం చేస్తున్నారని మండిపడ్డారు.

Kishan Reddy: బీఆర్‌ఎస్‌తో  రేవంత్‌ కుమ్మక్కు

  • అందుకే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు నిర్వీర్యం

  • సీఎం అసమర్థతను బీజేపీపై రుద్దే యత్నం

  • ఈ కేసును రేవంత్‌ వదిలినా.. మేం వదలం

  • దెయ్యమని తిట్టి.. సోనియా కాళ్లు మొక్కిందెవరు?: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎ్‌సతో కుమ్మక్కై.. సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును నిర్వీర్యం చేశారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్‌.. కేంద్రాన్ని బద్‌నాం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు, రేవంత్‌కు తేడా ఏమీ లేదని.. కేసీఆర్‌ నుంచి పుణికిపుచ్చుకున్నట్లుగా రేవంత్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి ఇవ్వాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్‌ చేసిన రేవంత్‌.. సీఎం అయ్యాక బీఆర్‌ఎ్‌సతో కుమ్మక్కై కేసును నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఈ కేసులో అరెస్టయినవాళ్లు బెయిల్‌ తీసుకుని దర్జాగా బయటకు వస్తుంటే.. రేవంత్‌ అసమర్థతను బీజేపీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ట్యాపింగ్‌ కేసును సీబీఐకి ఇవ్వాలని బీజేపీ హైకోర్టును ఆశ్రయించిందని గుర్తుచేశారు. ఈ కేసును రేవంత్‌ వదలిపెట్టినా తాము వదలిపెట్టబోమని తేల్చిచెప్పారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని.. దర్యాప్తు ఎలా ముందుకెళ్లదో తాము చూస్తామని ప్రకటించారు. మజ్లిస్‌, బీఆర్‌ఎస్‌, కమ్యూనిస్టు పార్టీ, దేశ వ్యతిరేక శక్తులతో చీకటి ఒప్పందాలు చేసుకున్న చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని మండిపడ్డారు. ‘‘మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఒకదాంట్లోనే పోటీచేస్తున్న మీరు.. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటైందంటున్నారు.. మరి మిగతా రెండింటిలో ఎవరు ఎవరితో కుమ్మకైన్నట్లు..?’’ అని రేవంత్‌ను నిలదీశారు. రేవంత్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి భయం పట్టుకుందని.. ఆయన ఎవరిని విమర్శించారో, ఎందుకు విమర్శించారో అర్థం కాదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.


ఆర్‌ఆర్‌ఆర్‌, టెక్స్‌టైల్‌ పార్క్‌ తెచ్చింది నేనే..

మూసీ ప్రక్షాళనకు కేంద్రం అనుమతి ఎందుకని సీఎంను ప్రశ్నించారు. ఆ ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని కానీ, పేదల ఇళ్లు కూల్చివేయవద్దన్నదే తమ విధానమని తెలిపారు. రీజినల్‌ రింగ్‌రోడ్డును, రేవంత్‌ సీఎం కాకముందే తాను మంజూరు చేయించానని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కానీ, ఆ ప్రాజెక్టును తానే అడ్డుకుంటున్నానని రేవంత్‌ ఆరోపణలు చేయడం దారుణమని మండిపడ్డారు. టెక్స్‌టైల్‌ పార్కు, రీజినల్‌ రింగ్‌రోడ్డును తెచ్చింది తానేనని కిషన్‌రెడ్డి చెప్పారు. ముస్లింలను బీసీల్లో చేర్చేందుకు రేవంత్‌ ప్రయత్నిస్తున్నారని.. అది బరాబర్‌ తప్పేనని అన్నారు. మతాన్ని తీసుకువచ్చి బీసీల్లో కలపడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రేవంత్‌లా తాను పార్టీలు మారలేదని.. కోర్టులు, జైళ్లు, పార్టీలు, నాయకుల చుట్టూ తిరగలేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. నమ్మిన సిద్ధాంతం కోసం, పనిచేస్తున్న తనను విమర్శించే హక్కు రేవంత్‌కు లేదన్నారు. సోనియాను దెయ్యమన్న రేవంత్‌.. ఆ తర్వాత దేవత అంటూ ఆమె కాళ్లు పట్టుకున్నారని తెలిపారు. ఢిల్లీ నుంచి ఎవరో తిడితే, ఆదరబాదరగా ప్రచారానికి వెళ్లి తనపై, బండి సంజయ్‌పై రేవంత్‌ విరుచుకుపడ్డారని విమర్శించారు. 14 నెలల్లో తెలంగాణ స్వర్గమైనట్లు మాట్లాడుతున్నారని.. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా అమలు చేశారా..? అని కిషన్‌రెడ్డి నిలదీశారు.


ఫీజులు, ఉద్యోగుల బకాయిలు చెల్లించండి..

హైదరాబాద్‌/న్యూఢిల్లీ/నల్లగొండ టౌన్‌/కామారెడ్డి టౌన్‌(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్‌దారులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డికి సోమవారం లేఖ రాశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.7,500 కోట్లకుపైగా పేరుకుపోయాయని.. డీఏలు, జీపీఎఫ్‌ బకాయిలు, మెడికల్‌ బిల్లులు, గ్రాట్యుటీ పెన్షన్‌, లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌కు సంబంధించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు రూ.8,200 కోట్లు బకాయి ఉన్నాయని చెప్పారు. గత ఏడాది 8 వేల మంది ఉద్యోగులు రిటైర్‌ అయితే నేటికీ ఒక్కరికి కూడా చిల్లిగవ్వ ఇవ్వకపోవడం దారుణమన్నారు.


ఇవి కూడా చదవండి...

CM Revanth Reddy: సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి

Telangana: మేడిగడ్డ వ్యవహారం.. కేసీఆర్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..

TGSRTC: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆరోజు ఏకంగా 3 వేల బస్సులు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 25 , 2025 | 05:21 AM