తొలితరం ఐటీ ఇంజనీర్ మధుసూదన్రావు మృతి
ABN , First Publish Date - 2022-04-03T09:03:15+05:30 IST
తొలితరం ఐటీ ఇంజనీర్ సుంకర మధుసూదన్రావు (81) అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు.

హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): తొలితరం ఐటీ ఇంజనీర్ సుంకర మధుసూదన్రావు (81) అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు. విద్యుత్తు సదుపాయంలేని పల్లెలో జన్మించి.. విదేశాల్లో పనిచేసిన అనుభవంతో మన దేశంలో కంప్యూటర్ విద్యను ఉన్నతస్థాయికి చేర్చడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఏపీలోని కృష్ణాజిల్లా పొనుకుమాడు గ్రామంలో 1940 ఆగస్టు 12న జన్మించిన మధుసూదన్రావు.. ఆంధ్రా యూనివర్సిటీలో ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యునికేషన్ ఇంజనీరింగ్ చేశారు. తర్వాత నైవేలీ ఇండస్ట్రీస్, ఐటీఐ బెంగళూరులో కొంతకాలం పనిచేసి.. యూకే వెళ్లి ఇంటర్నేషనల్ కంప్యూటర్స్ లిమిటెడ్లో ఉద్యోగంలో చేరారు. ఐటీ, హార్డ్వేర్ రంగాల్లో భారతీయ విద్యార్ధులను ప్రోత్సహించడానికి 1964లో తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. పేద విద్యార్ధులకు ఐటీ, హార్డ్వేర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి గుడివాడలో 1990లో సుంకర ఛారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేశారు. దాదాపు 10వేల మందికి ఉచితంగా, రాయితీతో శిక్షణ అందించారు. ఐటీ రంగంలో నిపుణులను పెంచడం ద్వారా ఐటీ సంస్థలను నెలకొల్పడానికి పరోక్షంగా దోహదపడ్డారు. కాగా.. స్వగృహంలో ప్రార్థనల అనంతరం అంత్యక్రియలు ఆదివారం మద్యాహ్నం మహాప్రస్థానంలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.