ఘాట్రోడ్డులో ఆంక్షలు
ABN , First Publish Date - 2021-03-08T05:33:55+05:30 IST
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైలానికి వెళ్లే గూడ్స్ వాహనాలపై పోలీసు, రవాణాశాఖలు ఆంక్షలు విధిం చాయి

- సరుకుల వాహనాలకు అనుమతి లేదు
- రేపటి నుంచి 12వ తేదీ వరకు అమలు
ఆత్మకూరు, మార్చి 7: మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైలానికి వెళ్లే గూడ్స్ వాహనాలపై పోలీసు, రవాణాశాఖలు ఆంక్షలు విధిం చాయి. నల్లమలలోని కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి మీదుగా ఆంక్షలు అమలు చేయనున్నారు. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు బైర్లూటి చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేస్తారు. శ్రీశైలానికి కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లే లారీలు, ట్రాక్టర్లు, ఐచర్లు, ప్రయాణికులతో వచ్చే గూడ్స్ వాహనాలను, పరిమితికి మించి ప్రయాణికుల్ని ఎక్కించుకుని శ్రీశైలానికి వెళ్లే వాహనాలను అడ్డుకుంటారు. మార్కాపురం, ఒంగోల్, విజయవాడ ప్రాంతాలకు వెళ్లే గూడ్స్ వాహనాలను నంద్యాల, గిద్దలూరు, కుంట మీదుగా దారి మళ్లిస్తారు. మార్చి 11న శ్రీశైలంలో జరిగే పాగాలంకరణకు వేలాదిగా భక్తులు వస్తారు. 11వ తేదీ రాత్రి 9.30 గంటల నుంచి శ్రీశైలం ఘాట్లో వాహనాల రద్దీ తగ్గే వరకు దోర్నాల నుంచి శ్రీశైలానికి వెళ్లే వాహనాలను కూడా నిలిపేస్తామని ఆత్మకూరు ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు.
పాగాలంకరణ అనంతరం శ్రీశైలం నుంచి దోర్నాలకు వచ్చే వాహనాలు మినహా, ఎదురుగా ఇతర వాహనాలు రాకుండా చూస్తామని ఆయన తెలిపారు. అవసరం మేరకు ఆర్టీసీ బస్సులకు శ్రీశైలం ఘాట్ రోడ్డులో అనుమతిస్తారు.