ISRO: పీఎస్ఎల్వీ-సీ 54 రిహార్సల్ విజయవంతం
ABN , First Publish Date - 2022-11-23T19:54:15+05:30 IST
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 26న ఉదయం 11.56గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోట (Sriharikota)లోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ-సీ 54 రాకెట్ ప్రయోగం జరపడానికి శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు.

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 26న ఉదయం 11.56గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోట (Sriharikota)లోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ-సీ 54 రాకెట్ ప్రయోగం జరపడానికి శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఈ ప్రయోగ సన్నాహాల్లో భాగంగా బుధవారం ప్రయోగాత్మక ప్రయోగాన్ని (రిహార్సల్) నిర్వహించారు. రాకెట్ (Rocket)ను మొబైల్ సర్వీసు టవర్ నుంచి ముందుకు తీసుకెళ్లి మళ్లి వెనక్కి తెచ్చే ప్రక్రియను చేపట్టారు. గురువారం ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్ఆర్) సమావేశం నిర్వహించనున్నారు. ఎంఆర్ఆర్ అనంతరం లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) సమావేశమై ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి జరిగే ఈ రాకెట్ ప్రయోగం ద్వారా భారత్కు చెందిన 960కిలోల ఓషన్శాట్-3 (ఈవోఎస్-06) ఉపగ్రహంతో పాటు మరో 8 ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు. భారత్,భూటాన్ సంయుక్తంగా రూపొందించిన భూటాన్ శాట్ (Bhutan Sat), పిక్సెల్ సంస్థ తయారు చేసిన ఆనంద్ శాట్, ధ్రువ స్పేస్ సంస్థ రూపొందించిన రెండు తైబోల్డ్ శాట్లు, అలాగే అమెరికాకు చెందిన స్పేస్ ఫ్లైట్ సంస్థకు చెందిన నాలుగు అస్ట్రోకాస్ట్ ఉపగ్రహాలను ఈ వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు. రాకెట్ నాలుగు దశలకు సంబంధించిన అనుసంధాన పనులను శాస్త్రవేత్తలు పూర్తి చేసి ప్రయోగానికి సిద్ధం చేశారు. నాలుగో దశలో ఉపగ్రహాన్ని అమర్చి దాని చుట్టూ ఉష్ణకవచం (హీట్షీల్డ్) అమర్చే ప్రక్రియ పూర్తి చేసి రాకెట్ను ప్రయోగానికి సిద్ధం చేశారు.