Tenth paper leakage Case: బండి సంజయ్‌కి రిమాండ్.. ఎక్కడికి తరలిస్తున్నారంటే..

ABN , First Publish Date - 2023-04-05T19:10:07+05:30 IST

: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌కు హన్మకొండ మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది.

Tenth paper leakage Case: బండి సంజయ్‌కి రిమాండ్.. ఎక్కడికి తరలిస్తున్నారంటే..

హన్మకొండ: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌కు హన్మకొండ మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో మెజిస్ట్రేట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 వరకు రిమాండ్ విధిస్తున్నట్టు పేర్కొంది. కరీంనగర్ వెళ్లే మార్గంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. బండిసంజయ్ తోపాటు మరో ముగ్గురు నిందితులను కూడా కరీంనగర్ జైలుకు తరలించారు.

కాగా.. హన్మకొండ మేజిస్ట్రేట్ (Hanmakonda Magistrate) ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్ (Bandi Sanjay)ను పోలీసులు హాజరుపర్చారు. బండి సంజయ్‌ లాయర్లను మెజిస్ట్రేట్ పిలిపించింది. బండి సంజయ్‌ అరెస్ట్ అక్రమమని న్యాయవాదులు వాదించారు. సంజయ్‌ తరపున లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనలు ముగిశాయి.

గంట ముందు వరంగల్ సీపీ రంగనాథ్‌ (CP Ranganath) మీడియాతో మాట్లాడుతూ టెన్త్ హిందీ పేపర్‌ను ప్రశాంత్ వైరల్ చేశాడని, మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేశామని తెలిపారు. ప్రశాంత్‌, మహేష్‌ ప్రశ్నాపత్రాన్ని బండి సంజయ్‌ (Bandi Sanjay)కు పంపారని, బండి సంజయ్‌కు ఉదయం 11.24 గంటలకు క్వశ్చన్‌ పేపర్ చేరిందని సీపీ వెల్లడించారు. ఏ2 ప్రశాంత్‌ ఎమ్మెల్యే ఈటలకు ఉదయం 10.41 గంటలకు పేపర్ పంపాడని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఉదయం 9.30 గంటలకే ప్రశ్నాపత్రం లీకైనట్లు అసత్య ప్రచారం చేశారని, అరెస్ట్ సమయంలో బండి సంజయ్‌ తన దగ్గర ఫోన్‌ లేదన్నారని సీపీ చెప్పారు. విచారణలో బండి సంజయ్ నేరాన్ని ఒప్పుకున్నారని, బీజేపీలో చాలామందికి పేపర్ షేర్ చేశారని వరంగల్ సీపీ రంగనాథ్‌ పేర్కొన్నారు. ప్రశ్నాపత్రం పంపాక ప్రశాంత్ 149 మందితో మాట్లాడాడని, పేపర్ లీక్‌కు ముందు రోజు బండి సంజయ్‌, ప్రశాంత్ చాట్ చేసుకున్నారని, పథకం ప్రకారమే ఇదంతా జరిగిందని సీపీ తెలిపారు. కమలాపూర్‌ స్కూల్ నుంచి పేపర్ బయటకు వచ్చిందన్నారు.

పేపర్‌ లీక్‌ కేసులో మరికొందరు కీలక సాక్షులను ప్రశ్నించాల్సి ఉందని, అనవసరంగా ఈ కేసులో ఇరికించాలనే ఉద్దేశం తమకు లేదని, బండి సంజయ్‌ అరెస్ట్‌పై లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం ఇచ్చామని సీపీ తెలిపారు. విచారణలో ఏ2 ప్రశాంత్‌ కూడా నేరాన్ని అంగీకరించాడని, సంజయ్‌ ఫోన్ దొరికి ఉంటే చాలా విషయాలు బయటకు వచ్చేవి అని సీపీ అన్నారు. ప్రశాంత్ పేపర్ బయటకు పంపిన వెంటనే బండి సంజయ్‌ ప్రెస్‌మీట్‌ పెట్టారని, బండి సంజయ్‌ దురుద్దేశంతోనే ఇలా చేసినట్లు నిర్ధారణ అయిందని సీపీ స్పష్టం చేశారు.

టెన్త్‌ పేపర్‌ లీక్‌ కేసులో A1గా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ను పోలీస్ రిమాండ్ రిపోర్ట్‌లో చేర్చారు. A2గా బూర ప్రశాంత్‌, A3గా మహేష్‌, A4గా బాలుడు, A5గా మోతం శివగణేశ్‌, A6గా పోగు సుభాష్‌, A7గా పోగు శశాంక్, A8గా దూలం శ్రీకాంత్‌, A9గా పెరుమాండ్ల శార్మిక్, A10గా పోతబోయిన వసంత్‌ను పోలీస్ రిమాండ్ రిపోర్ట్‌లో చేర్చారు.

Updated Date - 2023-04-05T21:22:11+05:30 IST