నేడు హైదరాబాద్‌లో ఈ రూట్లలో వెళుతున్నారా? ఆ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు బంద్..

ABN , First Publish Date - 2023-04-21T09:01:54+05:30 IST

రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా పాతాబస్తీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

నేడు హైదరాబాద్‌లో ఈ రూట్లలో వెళుతున్నారా? ఆ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు బంద్..

హైదరాబాద్ : రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా పాతాబస్తీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా మక్కా మసీద్‌లో ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపునకు చర్యలు తీసుకున్నారు. చార్మినార్-మదీనా, చార్మినార్-ముర్గీ చౌక్, చార్మినార్ -రాజేష్ మెడికల్ హాల్, శాలిబండ మధ్య ప్రధాన రహదారులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని రకాల వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నారు.

చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను వివిధ పాయింట్ల వద్ద మళ్లించనున్నారు. నయాపూల్ వైపు నుంచి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను మదీనా జంక్షన్ వద్ద సిటీ కాలేజీ వైపునకు మళ్లించారు. అదేవిధంగా హిమ్మత్‌పురా, చౌక్ మైదాన్ ఖాన్, మోతిగల్లి, ఈతేబార్ చౌక్, సెహర్-ఎ-బాటిల్ కమాన్, లక్కడ్ కోటే వద్ద ట్రాఫిక్ మళ్లించనున్నారు. మక్కా మసీదుకు వచ్చే భక్తుల వాహనాలకు ఏడు వేర్వేరు చోట్ల పార్కింగ్‌ ఏర్పాటు చేశామని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-04-21T09:01:54+05:30 IST