Share News

వీధి కుక్కలకు మైక్రోచిప్‌లు

ABN , Publish Date - Jul 22 , 2024 | 03:58 AM

బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) వీధి కుక్కలపై కీలక నిర్ణయం తీసుకుంది. వీధి కుక్కల్లో మైక్రోచిప్‌లు ఏర్పాటు చేసే ప్రక్రియను పైలట్‌

వీధి కుక్కలకు మైక్రోచిప్‌లు

పైలట్‌ ప్రాజెక్టుగా బెంగళూరులో అమలు

బీబీఎంపీ సిద్ధం.. సర్వత్రా విమర్శలు

బెంగళూరు, జూలై 21: బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) వీధి కుక్కలపై కీలక నిర్ణయం తీసుకుంది. వీధి కుక్కల్లో మైక్రోచిప్‌లు ఏర్పాటు చేసే ప్రక్రియను పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించేందుకు సిద్ధమైంది. నగర పాలక సంస్థకు చెందిన పశుసంవర్థక శాఖ అధికారులు దీన్ని ధ్రువీకరించారు. ఏడాదిలో ఒకే కుక్కకు అనేక సార్లు టీకాలు వేయకుండా ఈ మైక్రోచిప్‌ ద్వారా గుర్తించవచ్చని తెలిపారు. ఈ ప్రణాళికను ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రకటించారు. ఇప్పుడు పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. దీనిలో భాగంగా మూడు జోన్లలో 1000 వీధి కుక్కలకు మైక్రోచి్‌పలతో జియోట్యాగింగ్‌ చేయనున్నారు. వీటి కోసం రూ.5 లక్షలు ఖర్చవుతుందని బీబీఎంపీ తెలిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా వీధి కుక్కలకు మెడ భాగంలో ఒక అంగుళం సైజు ఉండే మైక్రోచిప్‌ను అమర్చుతారు. స్కానర్ల సాయంతో దానిలోని వివరాలను స్కాన్‌ చేయవచ్చు. అయితే ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని పలువురు విమర్శిస్తున్నారు. జంతు హక్కుల కార్యకర్త సుజయ జగదీశ్‌ మైక్రోచిప్‌ అమర్చడాన్ని తప్పుబట్టారు. చాలా దేశాల్లో పెంపుడు కుక్కలకు చిప్‌లు అమర్చారు కానీ, ఇలా స్వేచ్ఛగా తిరిగే వీధికుక్కల్లో ఏర్పాటు చేయలేదని చెప్పారు. చిప్‌లు అమర్చే ప్రక్రియను సక్రమంగా చేయకపోతే కుక్కల్లో వెన్నెముక దెబ్బతింటుందని, అంటువ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మరో కార్యకర్త నవీన కామత్‌ కూడా.. మైక్రోచి్‌పలు కుక్కల శరీరంలోని నిర్దేశిత ప్రాంతం నుంచి పక్కకు జరిగితే ఆ తర్వాత వాటిని ఎవరు పర్యవేక్షిస్తారని, దీనివల్ల ప్రజాధనం వృథా తప్ప ఉపయోగం ఉండదని అన్నారు.

Updated Date - Jul 22 , 2024 | 03:58 AM