Share News

TG News : ఫోన్‌ ట్యాపింగ్‌లో కొత్త కోణాలు ఉన్నాయ్‌

ABN , Publish Date - Aug 21 , 2024 | 03:28 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయని, వాటన్నింటిపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. తప్పించుకొని తిరుగుతూ విదేశాల్లో ఉంటున్న నిందితులను పట్టుకుంటామని పేర్కొంది.

TG News : ఫోన్‌ ట్యాపింగ్‌లో కొత్త కోణాలు ఉన్నాయ్‌

  • వాటిపైనా దర్యాప్తు చేస్తున్నాం

  • విదేశాల్లో ఉన్నవారిని తీసుకొస్తాం

  • కౌంటర్‌ దాఖలు చేసిన హోం శాఖ

హైదరాబాద్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయని, వాటన్నింటిపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. తప్పించుకొని తిరుగుతూ విదేశాల్లో ఉంటున్న నిందితులను పట్టుకుంటామని పేర్కొంది. నిందితులు తమ వ్యక్తిగత ఎజెండాలను అమలు చేసుకోవడంతో పాటు, అప్పటి అధికార పార్టీ అయిన బీఆర్‌ఎ్‌సకు సహాయం చేయడానికి ఈ అక్రమాలకు పాల్పడినట్లు తెలిపింది.

వీటన్నంటి సమాచారంతో అనుబంధ ఛార్జిషీట్‌ దాఖలు చేస్తామని పేర్కొంది. న్యాయమూర్తుల ఫోన్‌లను సైతం ట్యాపింగ్‌ చేశారంటూ పత్రికల్లో కథనాలు రావడడంతో ఈ అంశంపై హైకోర్టు సుమోటోగా విచారణ జరుపుతోంది.

మంగళవారం చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ టి. వినోద్‌కుమార్‌ల ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఇప్పటికే ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కౌంటర్‌ దాఖలు చేయగా తాజాగా హోంశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రవిగుప్త కౌంటర్‌ దాఖలు చేశారు.


‘‘ఫోన్‌ట్యాపింగ్‌ కేసు ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదిని దెబ్బతీసేలా జరిగిన తీవ్రనేరం. ఈ నేరంలో ప్రమేయం ఉన్న సీనియర్‌ పోలీస్‌ అధికారులను కూడా వదిలిపెట్టకుండా చట్ట ప్రకారం విచారణ కొనసాగిస్తున్నాం.

ట్రయల్‌ కోర్టులో ఇప్పటికే ఛార్జిషీట్‌ దాఖలు చేశాం. ఏ-1 ప్రభాకర్‌ రావు సహా నిందితులందరూ తమ వ్యక్తిగత ఎజెండాలను అమలు చేయడంతోపాటు అప్పటి అధికారపార్టీ బీఆర్‌ఎస్‌ లక్ష్యాలను సాధించడానికి పనిచేశారు.

ట్యాపింగ్‌ కార్యకలాపాలు నిర్వహించేందుకు గుర్తింపుపొందిన అధికారిగా ఉన్న ప్రభాకర్‌రావు వామపక్ష తీవ్రవాదంపై నిఘా అన్న సాకుతో ఎలాంటి అనుమతి లేకుండా ఇష్టానుసారం వ్యవహరించారు. తప్పుడు సమాచారంతో అనుమతులు పొందారు. హార్డ్‌డి్‌స్కలను ధ్వంసం చేశారు. ఏ-1 ప్రభాకర్‌ రావు, ఏ-6 శ్రవణ్‌కుమార్‌ రావులను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం.


ఏ2 ప్రణీత్‌రావు అధ్వర్యంలో స్పెషల్‌ టీం ఏర్పాటు చేసి ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్‌ చేశారు. బీఆర్‌ఎ్‌సకు సహాయం చేయడం కోసం టి. ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావులు తమ చట్టబద్ధమైన విధులను ఉల్లంఘించడంతోపాటు ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ యాక్ట్‌ నిబంబధనలు ఉల్లంఘించడం, మోసాలకు పాల్పడటం ద్వారా అనుమతులు పొందడం వంటి క్రిమినల్‌ చర్యలకు పాల్పడ్డారు’’ అని ఆ కౌంటర్‌లో వివరించారు.

మాతో సంప్రదింపులు జరపలేదు: కేంద్రం

కేంద్ర ప్రభుత్వం కూడా కౌంటర్‌ సమర్పించింది. టెలిగ్రాఫ్‌ యాక్ట్‌ ప్రకారం చట్టబద్ధంగా ఇంటర్‌సెప్షన్‌ ఆదేశాలు ఇవ్వడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన అధికారాలున్నాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రంతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని, కేసు దర్యాప్తుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం ఇప్పటివరకు అందలేదని పేర్కొంది. తదుపరి విచారణ సెప్టెంబర్‌ 8కి వాయిదా పడింది.

Updated Date - Aug 21 , 2024 | 03:28 AM