ఇసుక అక్రమ రవాణా మళ్లీ మొదలు
ABN , Publish Date - Apr 12 , 2025 | 01:44 AM
పిచ్చాటూరు మండలం అరుణానది పరివాహక ప్రాంతాల్లో వారం రోజులుగా సద్దుమణిగిన ఇసుక అక్రమ రవాణా మళ్లీ మొదలైంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు చొరవతో ఇసుక తరలిస్తున్న రహదారులకు కందకాలు తవ్వించడం.. వాటిని ధ్వంసం చేయడంతో కొంత కాలం అక్రమ రవాణా ఆగింది.

పిచ్చాటూరు, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): పిచ్చాటూరు మండలం అరుణానది పరివాహక ప్రాంతాల్లో వారం రోజులుగా సద్దుమణిగిన ఇసుక అక్రమ రవాణా మళ్లీ మొదలైంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు చొరవతో ఇసుక తరలిస్తున్న రహదారులకు కందకాలు తవ్వించడం.. వాటిని ధ్వంసం చేయడంతో కొంత కాలం అక్రమ రవాణా ఆగింది. మామూలుగా అడవికొడియంబేడు నుంచి తరలించే ఇసుకను.. ఈ సారి రూటు మార్చి పులియకుండ్రం నుంచి తరలించడం ప్రారంభించారు. దీంతో కొందరు రైతులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా, వారిపై ఇసుక మాఫియా దాడులకు పూనుకోవడంతో, వారు భయపడి వదిలేశారు. పగటిపూట ఉచిత ఇసుక సాకుతో ట్రాక్టర్ల ద్వారా తరలించి అడవిశంకరాపురం వెళ్లే మార్గంలో డంపు చేస్తున్నారు. ఆ ఇసుకను రాత్రి వేళల్లో భారీ వాహనాల ద్వారా తమిళనాడు తరలిస్తున్నారు. గతంలో ప్రధాన రహదారుల గుండా పోవడంతో అధికారులు, గ్రామస్తులు అడ్డుకుంటారని భయం ఉండేది. ఇప్పుడు తచ్చూరు-చిత్తూరు సిక్స్లేన్ జాతీయ రహదారిపైకి ఎక్కేస్తే ఎదురేలేదు. ఇసుక కోసం 30 అడుగుల మేర తవ్వుతుండటంతో నది పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటిపోయి వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బ తినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ వీరు ఖాతరు చేయడం లేదు.